మాకే నకిలీ కాపీలు సమర్పిస్తారా? | Telangana High Court Fires on private person Taher Khan | Sakshi
Sakshi News home page

మాకే నకిలీ కాపీలు సమర్పిస్తారా?

Apr 12 2025 5:31 AM | Updated on Apr 12 2025 5:31 AM

Telangana High Court Fires on private person Taher Khan

ప్రైవేట్‌ వ్యక్తి తాహెర్‌ ఖాన్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

పోలీసులకు ఫిర్యాదు చేయాలని రిజిస్ట్రార్‌కు ఆదేశం

ఈ అంశంపై సిట్‌ను ఏర్పాటు చేయాలని సర్కారుకు స్పష్టీకరణ 

100 ఎకరాల భూ వివాదంలో ధర్మాసనం చర్యలు

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ పరిధిలోని దాదాపు 100 ఎకరాల భూమికి సంబంధించి అనుకూల ఉత్తర్వులు పొందడం కోసం న్యాయస్థానం ఇచ్చిందంటూ నకిలీ ఆదేశాల కాపీలను తమకు సమర్పించడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంబంధిత వ్యక్తులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ప్రైవేట్‌ పార్టీపై చార్మినార్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ (జ్యుడీషియల్‌–1)కు స్పష్టం చేసింది.

మొత్తం ఈ అంశంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటు చేయాలని, వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ భూములకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకుండా సంబంధిత అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చేలాగా విషయాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లాలని రిజిస్ట్రార్‌కు సూచించింది. సాధారణ ప్రజలు ఆ భూములను కొనకుండా హైకోర్టు వెబ్‌సైట్‌లో ప్రదర్శించాలని తెలిపింది. సదరు భూమిపై యథాతథ స్థితి ఉత్తర్వులు అమల్లో ఉంటాయని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

జస్టిస్‌ వినోద్‌కుమార్‌ పరిశీలనతో...
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని సర్వే నంబర్లు 661, 662, 663, 664, 720, 721, 724, 725, 726, 727, 728, 729, 730, 731, 732, 775లోని భూ వివాదంపై సివిల్‌ కోర్టులో సూట్‌ దాఖలైంది. ఈ కేసులో హైదరాబాద్‌లోని జహానుమాకు చెందిన మహమ్మద్‌ తాహెర్‌ ఖాన్‌కు అనుకూలంగా సివిల్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ హెచ్‌ఎండీఏ హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేసింది. ఈ కేసు గత విచారణ సందర్భంగా ప్రైవేట్‌ పార్టీ దాఖలు చేసిన కోర్టు ఆదేశాల కాపీ కల్పితమని ధర్మాసనం గుర్తించింది. జస్టిస్‌ ఎన్‌డీ పట్నాయక్‌ నేతృత్వంలోని బెంచ్‌ 1988 ఏప్రిల్‌ 29న ఆ ఉత్తర్వులు జారీ చేసినట్లు కాపీలో ఉండటాన్ని జస్టిస్‌ వినోద్‌కుమార్‌ గమనించి దాన్ని తప్పుడు కాపీగా తేల్చారు.

1988లో తాను న్యాయవాదిగా చేరానని.. అదే సంవత్సరం డిసెంబర్‌ 28న ఎన్‌డీ పట్నాయక్‌ న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారని చెప్పారు. ఏప్రిల్‌లో ఉత్తర్వులు జారీ చేసే పరిస్థితే లేదన్నారు. అలాగే ప్రైవేట్‌ పార్టీలు సమర్పించిన ఇతర డాక్యుమెంట్లు, కాపీలు కూడా నకిలీవేనని న్యాయమూర్తి గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టి నివేదిక సమర్పించేందుకు రిజిస్ట్రార్‌ (జ్యుడీషియల్‌–1)ను నియమించారు. జస్టిస్‌ బి. సుదర్శన్‌రెడ్డి ఇచ్చినట్లు సమర్పించిన మరో ఉత్తర్వుల కాపీ కూడా కల్పితమేనని రిజిస్ట్రార్‌ తేలుస్తూ గత నెల సీల్డ్‌ కవర్‌లో నివేదిక అందజేశారు.

ఈ నివేదికను పరిశీలించిన జస్టిస్‌ తడకమల్ల వినోద్‌కుమార్, జస్టిస్‌ పి. శ్రీసుధ ధర్మాసనం శుక్రవారం అప్పీల్‌పై మరోసారి విచారణ చేపట్టింది. హెచ్‌ఎండీఏ తరఫున అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపించారు. కల్పిత ఉత్తర్వుల కాపీలను సమర్పించడాన్ని ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. ప్రైవేట్‌ పార్టీపై క్రిమినల్‌ చర్యలకు ఆదేశిస్తూ భూములపై స్టేటస్‌కో ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement