భిన్న కారణాలు చూపడం ఆలోచన లేని నిర్ణయం
టీజీపీఎస్సీ తీరును తప్పుబట్టిన హైకోర్టు
పిటిషనర్ను స్థానికుడిగా పరిగణించాలని ఆదేశం
స్థానిక హోదాకు సంబంధించి కీలక తీర్పు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) రాజ్యాంగబద్ధ నియామక సంస్థగా స్థిరమైన ప్రమాణాలు పాటించాలని హైకోర్టు స్పష్టం చేసింది. మారుతున్న కారణాలతో అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించడం చట్టబద్ధం కాదని.. ఇటువంటి వ్యాజ్యాలతో ప్రజా వనరులు, కోర్టు సమయం, అభ్యర్థుల కెరీర్ అవకాశాలు వృథా అవుతాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకసారి నాలుగు వరుస విద్యా సంవత్సరాలు లేవని, మరోసారి 1 నుంచి 7వ తరగతి వరకు తెలంగాణలో చదవలేదని.. ఇలా భిన్న కారణాలు చూపడం ఆలోచన లేని నిర్ణయమంది. స్థానిక హోదా అంశాన్ని టీజీపీఎస్సీ కొత్త కొత్త కారణాలతో మళ్లీ తెరపైకి తేవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. రిట్ పిటిషనర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) అభ్యర్థి పల్లా నిశాంత్కు స్థానిక హోదా కల్పించాలంటూ కీలక తీర్పు ఇచ్చింది. టీజీపీఎస్సీ దాఖలు చేసిన రిట్ అప్పీల్ను కొట్టివేస్తూ జస్టిస్ పి.శామ్కోíÙ, జస్టిస్ నర్సింగ్రావు నందికొండ ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులు వెలువరించింది. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఏపీలో చదివినందున టీజీపీఎస్సీ తనను ఏఈఈ పోస్టుల ఎంపికకు స్థానికుడిగా పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ నిశాంత్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సింగిల్ జడ్జి పిటిషనర్కు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో దీన్ని కమిషన్ అప్పీల్ చేసింది.
7వ తరగతే ప్రామాణికమనడం చట్టవిరుద్ధం
టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రపతి ఉత్తర్వు 2018లోని పేరా 7 ప్రకారం స్థానిక హోదా నిర్ణయానికి ఏడో తరగతి వరకు చదివిన ప్రాంతాన్నే పరిగణనలోకి తీసుకోవాలన్నారు. నిశాంత్ 1 నుంచి 6వ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్లో చదివినందున తెలంగాణలో స్థానికుడిగా గుర్తించలేమన్నారు. నిశాంత్ తరఫు న్యాయవాది వేదుల చిత్రలేఖ వాదనలు వినిపిస్తూ.. ఏఈఈ పోస్టుకు కనీస విద్యార్హత బీటెక్ అని, స్థానిక హోదా నిర్ణయానికి సంబంధిత అర్హత పరీక్ష బీటెక్ అవుతుందన్నారు. బీటెక్ చదివే వరకు నాలుగు వరుస విద్యా సంవత్సరాలు తెలంగాణలోనే అభ్యసించినందున స్థానిక హోదాకు అర్హుడని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. అభ్యర్థి స్థానిక హోదా విషయంలో టీజీపీఎస్సీ చేసిన వ్యాఖ్యానం సరైనది కాదంది.
అన్ని పోస్టులకు 7వ తరగతినే ప్రామాణికంగా పరిగణించడం చట్ట ఉద్దేశానికి విరుద్ధమని పేర్కొంది. సాంకేతిక, వృత్తిపరమైన పోస్టుల విషయంలో సంబంధిత అర్హత పరీక్షను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. టీజీపీఎస్సీ వాదనను అంగీకరిస్తే డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సుల ఆధారంగా జరిగే నియామకాల్లో నిబంధనల అసలు ఉద్దేశం నిరీ్వర్యమవుతుందని పేర్కొంది. తెలంగాణలో ఉన్నత విద్య పూర్తిచేసిన అభ్యర్థులను కేవలం ప్రారంభ విద్య వేరే రాష్ట్రంలో జరిగిందనే కారణంతో స్థానికేతరులనడం అన్యాయమని తేలి్చచెప్పింది. స్థానిక హోదా నిర్ణయం పరిపాలనా సౌలభ్యం కోసం కాకుండా చట్టబద్ధ ప్రమాణాల ఆధారంగానే ఉండాలని తేలి్చచెప్పింది. ఏ పోస్టుకైనా ఏడో తరగతినే ప్రమాణంగా తీసుకోవాలన్న టీజీపీఎస్సీ వాదన ఆమోదయోగ్యం కాదంది. పారా–7లోని నిబంధనలను విడిగా కాకుండా మొత్తం ఉత్తర్వు ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకోవాలంటూ అప్పీల్ను కొట్టివేసింది.


