ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు | Telangana HC Issues Big Update on Fee Reimbursement Case | Sakshi
Sakshi News home page

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Jun 25 2026 2:53 PM | Updated on Jun 25 2026 3:45 PM

Telangana HC Issues Big Update on Fee Reimbursement Case

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 9 లోని మార్గదర్శకాలపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. ఈ స్టే ఆదేశాలు వచ్చే మంగళవారం వరకు అమల్లో ఉంటాయని జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం స్పష్టం చేసింది.

కోట్లాది రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకుండా, విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయవద్దంటూ ఆంక్షలు విధించడంపై న్యాయస్థానం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకపోవడమే కాకుండా, విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయరాదన్న ప్రభుత్వ నిబంధనలను సవాలు చేస్తూ 89 ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.

కోట్లాది రూపాయల బకాయిలను పెండింగ్‌లో ఉంచితే కాలేజీలు తమ రోజువారీ నిర్వహణను, సిబ్బంది జీతాలను ఎలా చెల్లిస్తాయి? కాలేజీలు ఎలా నడుస్తాయి?" అని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం బకాయిలు చెల్లించదు, అటు కాలేజీలను విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోనివ్వదు. ఇలాంటప్పుడు ప్రస్తుత విద్యాసంవత్సరానికి విద్యార్థులకు అడ్మిషన్లు ఎలా ఇస్తారని కోర్టు నిలదీసింది.

గతంలో ప్రభుత్వం తెచ్చిన జీవో 7 పై హైకోర్టు స్టే ఇవ్వడంతో ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత ప్రభుత్వం తెచ్చిన కొత్త జీవో నెం. 9 లో కూడా పాత నిబంధనలనే కొనసాగిస్తూ విద్యార్థుల అలాట్‌మెంట్‌ లెటర్లలో ‘ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు’ అని పేర్కొనడాన్ని కోర్టు తప్పుబడుతూ స్టే ఇచ్చింది.

ప్రభుత్వం తరఫున స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ బకాయిల చెల్లింపుపై వివరణ ఇచ్చారు. ఈ రీయింబర్స్‌మెంట్‌ పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల నిధుల్లో కేంద్రం వాటా ఉంటుంది. అయితే, ముందుగా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి నిధులు చెల్లించాలని, ఆ తర్వాతే తమ వాటా విడుదల చేస్తామని కేంద్రం చెబుతోందని వివరించారు. దీనివల్ల మొత్తం బకాయిల భారం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడిందని, వేల కోట్ల రూపాయల బకాయిలు ఉండటం వల్లే కొంత ఆలస్యం జరుగుతోందని కోర్టుకు తెలిపారు. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి రెండు వారాల సమయం కావాలని కోరారు.

ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి జూలై 31 లోపు దరఖాస్తు చేసుకున్న అర్హులైన విద్యార్థులందరికీ ఆగస్టు 15 లోపు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను విడుదల చేస్తామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ప్రభుత్వం గనుక అధికారికంగా కోర్టుకు రోడ్‌మ్యాప్ సమర్పించి, ఆగస్టు 15 లోపు బకాయిలన్నీ స్పష్టంగా చెల్లిస్తామని హామీ ఇస్తే.. తాము దాఖలు చేసిన పిటిషన్లను విత్‌డ్రా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కాలేజీల యాజమాన్యాల తరఫు సీనియర్ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement