వ్యవసాయశాఖపై ప్రభుత్వ రిపోర్టు కార్డు
రైతు నమోదు నుంచి ఏఈఓ హాజరు వరకు...
టాప్–10లో ఐదు ఉత్తర తెలంగాణ జిల్లాలు... దక్షిణ జిల్లాల వెనుకంజ
70 మార్కులకు మూల్యాంకనం
7 ప్రమాణాలపై జిల్లాలకు పరీక్ష
సాక్షి ప్రతినిధి, వరంగల్: రైతులకు అందుతున్న సేవల్లో ఏ జిల్లా ముందుంది.. ఏ జిల్లా వెనుకబడింది..? రైతు నమోదు నుంచి ఏఈఓల హాజరు వరకు వ్యవసాయశాఖ పనితీరును రాష్ట్ర ప్రభుత్వం ఏడు పారామీటర్లలో కొలిచి జిల్లావారీగా రిపోర్ట్ కార్డు విడుదల చేసింది. 70 మార్కులకు నిర్వహించిన ఈ మూల్యాంకనంలో ఉత్తర తెలంగాణ జిల్లాలు అగ్రస్థానాలు దక్కించుకోగా, దక్షిణ తెలంగాణ జిల్లాలు వెనుకంజలో నిలిచాయి. ఉమ్మడి వరంగల్కు చెందిన జనగామ, హనుమకొండ జిల్లాలు టాప్–3లో చోటు దక్కించుకోవడం విశేషం. ఈ నివేదికలో రైతులకు అందుతున్న సేవల నాణ్యత, క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారుల పనితీరు, డిజిటల్ వ్యవస్థల వినియోగం, రైతు బీమా అమలు, ఎరువుల నిర్వహణ, ఫీల్డ్ స్థాయి పర్యవేక్షణ వంటి అంశాలను సమగ్రంగా అంచనా వేసి అధికారులకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

7 అంశాలు.. 70 మార్కులు..
ప్రతి జిల్లాను ఏడు అంశాల ఆధారంగా 10 మార్కుల చొప్పున మొత్తం 70 మార్కులకు మూల్యాంకనం చేశారు. ఇందులో రైతు రిజిస్ట్రీ, రైతు బీమా డేటా నమోదు, రైతు బీమా క్లెయిమ్ల పరిష్కారం, యూరియా వేరియేషన్ రిపోర్టు, ‘ఫైవ్’యాప్ వినియోగం, ఓఎల్ఎంఎస్ అమలు, ఏఈఓల హాజరు తదితర అంశాలన్నింటిలో సమగ్ర పనితీరు ఆధారంగానే జిల్లాలకు ర్యాంకులు కేటాయించారు. ఏ జిల్లా కూడా 52 మార్కులు దాటలేదు.
రైతులకు అందుతున్న సేవల నాణ్యత, ఫీల్డ్ స్థాయిలో అమలు, డిజిటల్ వ్యవస్థల వినియోగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులకు సంకేతాలు ఇచ్చినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వ్యవసాయ సేవల అమలులో ఈ జిల్లాలు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నివేదిక స్పష్టం చేసింది. వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాలు దాదాపు అన్ని పారామీటర్లలో మెరుగైన పనితీరు కనబర్చగా, పట్టణీకరణ అధికంగా ఉన్న దక్షిణ తెలంగాణ జిల్లాలు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినట్లు నివేదిక పేర్కొంది.


