జూరాల నుంచి శ్రీశైలం వైపు పరుగులు పెడుతున్న కృష్ణమ్మ
కృష్ణా, గోదావరి పరవళ్లు
కృష్ణా పరీవాహకంలో ఆల్మట్టి నుంచి జూరాల వరకు గేట్లు ఎత్తివేత... శ్రీశైలం ప్రాజెక్టుకు క్రమంగా పెరుగుతున్న వరద
ఎగువ గోదావరిలోనూ వరద ఉధృతి.. శ్రీరాంసాగర్కు భారీ ప్రవాహం
పోటెత్తిన కడెం, ప్రాణహిత, ఇంద్రావతి
కడెం గేట్లు ఎత్తివేత.. ఎల్లంపల్లి, మేడిగడ్డ, సమ్మక్క, సీతమ్మసాగర్కు భారీ వరద
నేడు భద్రాచలం వద్ద 10 లక్షల క్యూసెక్కులకు చేరనున్న వరద ప్రవాహం
సాక్షి, హైదరాబాద్ /గద్వాల/మంచిర్యాలరూరల్: బిరబిరా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది..గలగలా గోదావరి పరుగులు పెడుతోంది. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో ఎడతెరపి లేని వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు వరదెత్తాయి. శ్రీశైలం ప్రాజెక్టు వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. దీంతో ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. గురువారం ఉదయం 6 గంటలకు జలాశయానికి 30,194 క్యూసెక్కుల వరద రాగా, సాయంత్రం 6 గంటల వరకు 89,240 క్యూసెక్కులకు పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం 827.26 అడుగులకు చేరగా నిల్వలు 46.82 టీఎంసీలకు పెరిగాయి.
ప్రాజెక్టు నిండాలంటే మరో 168 టీఎంసీల నీరు అవసరం. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కొనసాగుతుండటంతో కృష్ణా ప్రధాన పాయ నుంచి కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్లలోకి వరద ప్రవాహం పెరిగింది. ఆల్మట్టి డ్యామ్లోకి 82,111 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 1.1లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలుతున్నారు.
నారాయణపూర్ డ్యామ్లోకి 1.1 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 1.11 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మహారాష్ట్రలోని ఉజ్జయినీ జలాశయానికి 33,803 క్యూసెక్కుల వరద వస్తుండగా, 31,600 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. దీంతో పైమూడు జలాశయాలకు దిగువన తెలంగాణలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు 94,733 క్యూసెక్కుల వరద పోటెత్తింది. ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా, 7.66 టీఎంసీల నీటిని నిల్వ చేస్తూ 85,421 క్యూసెక్కుల నీటిని 12 గేట్లు, విద్యుత్ కేంద్రం ద్వారా దిగువ వదులుతున్నారు.
ఇక కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో నిలకడక వరద కొనసాగుతోంది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్లోకి 14,922 క్యూసెక్కుల నీరు చేరుతుండగా..గరిష్ట నిల్వ సామర్థ్యం 105.79 టీఎంసీలకుగాను 36.04 టీఎంసీలకు నిల్వలు చేరాయి. జూరాల నుంచి విడుదల చేస్తున్న వరద శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండడంతో నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. దిగువన ఉన్న నాగార్జునసాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా ప్రస్తుతం 136.99 టీఎంసీల నిల్వలున్నాయి.
ఎగువ గోదావరిలో....
మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ఎగువ గోదావరిలో క్రమంగా వరద పెరుగుతోంది. దిగువ పరీవాహకంలోని ఛత్తీస్గఢ్, ఒడిశా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తారం వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకల్లో వరద ఉధృతమవుతోంది. గోదావరిపై మహారాష్ట్రలో ఉన్న జైక్వాడి ప్రాజెక్టులోకి 33,328 క్యూసెక్కుల వరద చేరుతుండడంతో గరిష్ట సామర్థ్యం 102.73 టీఎంసీలకు గాను 79.79 టీఎంసీలకు నిల్వలు పెరిగాయి. ఉపనది సింగూరులో వరద ప్రారంభం కాకపోవడంతో రాష్ట్రంలోని సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టులకు ఇంకా వరద ప్రారంభం కాలేదు.
ఎగువ గోదావరిపై ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 75,432 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో 80.5 టీఎంసీల గరిష్ట సామర్థ్యానికి గానూ 21.51 టీఎంసీలకు నిల్వలు చేరాయి. మరో ఉపనది కడెంపై ఉన్న కడెం ప్రాజెక్టుకు 1.44 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో 4.7 టీఎంసీల గరిష్ట సామర్థ్యానికి గాను 1.91 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 16 గేట్లు ఎత్తడం ద్వారా 1.48 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కడెం నుంచి 1.56 లక్షల క్యూసెక్కులు, గోదావరి నుంచి 2.07 లక్షల క్యూసెక్కులు కలిపి మొత్తం 3.63 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తడంతో 20.18 టీఎంసీల గరిష్ట నిల్వ సామరాŠథ్య్నికి గాను 19.09 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ నంది పంప్హౌస్ ద్వారా 15,750 క్యూసెక్కుల నీటిని మిడ్మానేరుకు తరలిస్తున్నారు. ప్రాజెక్ట్లోని 62 గేట్లలో 15 గేట్లు ఎత్తి 1.57 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు.
గోదావరి–ప్రాణహిత నదుల సంగమ స్థలం వద్ద నిర్మించిన మేడిగడ్డ బరాజ్లోకి ప్రాణహిత నుంచి 2.12 లక్షల క్యూసెక్కుల వరద రాగా, వచ్చిన వరదను వచ్చినట్టు కిందకు విడుదల చేస్తున్నారు. ప్రాణహితకు ఇంద్రావతి ప్రవాహం తోడు కావడంతో దిగువన ఉన్న సమ్మక్క బరాజ్కు 8.05 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తడంతో వచ్చిన వరదను వచ్చినట్టు కిందకు విడుదల చేస్తున్నారు. సీతమ్మసాగర్ బరాజ్కు 3.8 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండంతో వచ్చింది వచ్చినట్టు విడుదల చేస్తున్నారు. ప్రాణహిత, ఇంద్రావతి వరదెత్తిన నేపథ్యంలో శుక్రవారం నాటికి భద్రాచలం వద్ద వరద 10 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశముంది.


