ఎమ్మెల్యేల ఫిరాయింపు.. స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం | Supreme Court Hearing On BRS MLAs Party Change Petition | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేల ఫిరాయింపు.. స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

Nov 17 2025 9:51 AM | Updated on Nov 17 2025 5:42 PM

Supreme Court Hearing On BRS MLAs Party Change Petition

సాక్షి, ఢిల్లీ: తెలంగాణ స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోకపోవడాన్ని ఆక్షేపించింది. అంతేకాదు.. కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా జవాబు చెప్పాలని ఆదేశించింది.

2023 డిసెంబరులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్‌ పక్షంవైపు మళ్లడం తెలిసిందే. పార్టీ ఫిరాయించిన వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెళ్ళం వెంకటరావు, అరెకపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, ప్రకాశ్ గౌడ్, కాలే యదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. వీరిపై వేటు వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ స్పీకర్‌ను కోరింది. నిర్ణయం ఏదీ వెలువడని నేపథ్యంలో జనవరి 16న సుప్రీంకోర్టు ఆశ్రయించింది. కేసు విచారించిన సర్వోన్నత న్యాయస్థానం మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ గడువు పూర్తయిన తరువాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు మరోసారి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ‍

సోమవారం ఈ విషయమై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయి నేతృత్వంలోని బెంచ్‌ విచారణ జరిపింది. నిర్ణీత గడువులోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలన్న తమ ఆదేశాలను పాటించకపోవడం కోర్టు ధిక్కారమేనని స్పష్టం చేసింది. స్పీకర్‌ తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌  సింఘ్వీ, , ముకుల్‌ రోహత్గీలు మాట్లాడుతూ ఇంకో నాలుగు వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని నివేదించారు. రోజువారీ విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని, నాలుగు వారాల్లో తమకు జవాబు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

	కోర్టు ధిక్కర పిటిషన్‌పై తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

అంతకుముందు.. తెలంగాణ స్పీకర్‌ కార్యాలయం ఫిరాయింపు ఎమ్యెల్యేలపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ ప్రారంభించినట్టు సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్‌ దాఖలు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ విచారణ పూర్తి చేసేందుకు మరింత సమయం కావాలని కోరింది.  అయితే, జూలై 31న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ పాటించట్లేదంటూ బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement