సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాడ మాస బోనాల ఉత్సవాలను ఆగస్టు 2 వ తేదీన నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం ఆలయ EO మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ పండితులు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో కలిశారు.
ఈ సందర్భంగా ఈ సంవత్సరం ఆషాఢమాస బోనాల ఉత్సవాల వివరాలను తెలియజేస్తూ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు లేఖను అందజేశారు.జులై 19 వ తేదీన ఘటాల ఊరేగింపు ప్రారంభం అవుతుందని, ఆగస్టు 2 వ తేదీన అమ్మవారికి బోనాల సమర్పణ, 3 వ తేదీన రంగం (భవిష్య వాణి) ఉంటాయని EO వివరించారు. ఈ కార్యక్రమంలో రాంగోపాల్ పేట డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, రాం మోహన్ యాదవ్ తదితరులు ఉన్నారు.ఆషాఢ మాసంలో జరిగే బోనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. బోనాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షలాది భక్తుల రాష్ట్రం నలుమూలల నుంచి వస్తారు.
ఈ ఉత్సవాలను రెండు రోజుల పాటు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో, అత్యంత భారీ స్థాయిలో నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా నిర్వహించే "రంగం" (భవిష్యవాణి) కార్యక్రమం అత్యంత ప్రాముఖ్యమైనది. మాతంగి (స్వర్ణలత) అమ్మవారు పూని భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను, వర్షాల గురించి, ప్రజల క్షేమం గురించి భవిష్యవాణి చెప్తారు. దీనిని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.


