సోయా...ఇదేం ధరయ్యా? | Soya farmers are cheated by brokers | Sakshi
Sakshi News home page

సోయా...ఇదేం ధరయ్యా?

Oct 10 2024 4:18 AM | Updated on Oct 10 2024 4:18 AM

Soya farmers are cheated by brokers

మద్దతు ధర క్వింటాకు రూ.4,892... రూ.4,100 లోపే కొంటున్న వ్యాపారులు  

దిగుబడి అంచనా, 2.60 లక్షల మెట్రిక్‌ టన్నులు.. కేంద్రం కొనేది 56,550 మెట్రిక్‌ టన్నులే  

మిగిలింది వ్యాపారులు అడిగిన ధరకు అమ్ముకోవాల్సిందేనా అంటున్న రైతులు

సాక్షి, హైదరాబాద్‌: సోయా రైతులను దళారులు దగా చే స్తున్నారు. వానాకాలం సీజన్‌లో సాగు చేసిన సోయాబీన్‌ పంటకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,892 కాగా, వ్యాపారులు మాత్రం రూ.3,9 80 నుంచి గరిష్టంగా రూ. 4,100 వరకు మాత్రమే కొంటున్నారు. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. కొన్నిచోట్ల గత్యంతరం లేక తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు.  

ఉత్పత్తిలో నాలుగో వంతే కొనుగోలు  
తెలంగాణలో సోయాబీన్‌ కీలకమైన పంట. వరి, పత్తి, మొక్కజొన్న, కంది తర్వాత అత్యధికంగా సాగయ్యేది సోయాబీనే. ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో 4 లక్షల ఎకరాల్లో సోయాబీన్‌ సాగు చేశారు. అత్యధికంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ప్రస్తుత సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో సోయాబీన్‌ సాగైంది. 

ఈ ఏడాది 2.60 లక్షల మెట్రిక్‌ టన్నుల పంట ఉత్పత్తులు వస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అయితే కేంద్ర ప్రభు త్వం మాత్రం 56,550 మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొను గోలుకు అంగీకరించింది. ఆ నిర్ణీత పరిమాణంలో మాత్ర మే కొనుగోలు చేస్తామని మార్క్‌ఫెడ్‌ అధికారులు అంటున్నారు. 

అంటే మొత్తం ఉత్పత్తిలో కేవలం నాలుగోవంతే కొనుగోలు చేయడం వల్ల, మిగిలిన పంటను తిరిగి వ్యా పారులకే తెగనమ్ముకోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన పంటను కూడా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. కాగా, మిగిలిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేలా తాము ప్రతిపాదనలు పంపిస్తామని మార్క్‌ఫెడ్‌ వర్గాలు వెల్లడించాయి.  

13 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు  
దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తుండటంతో మార్క్‌ఫెడ్‌ రంగంలోకి దిగింది. నిజామాబాద్, కామారె డ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాలో 37 సోయాబీన్‌ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్క్‌ఫెడ్‌ నిర్ణయించింది. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో 13 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. 

అవసరాన్ని బట్టి మిగిలిన కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. రైతులకు మద్దతు ధర ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని మార్క్‌ఫెడ్‌ ఎండీ శ్రీనివాస్‌రెడ్డి, సేకరణ విభాగం ఇన్‌చార్జ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు.   

Advertisement
 
Advertisement
Advertisement