ఆలస్యం.. సమస్యాత్మకం..!? | Shocking Incident In Jagtial | Sakshi
Sakshi News home page

ఆలస్యం.. సమస్యాత్మకం..!?

Jun 22 2026 12:14 PM | Updated on Jun 22 2026 12:35 PM

Shocking Incident In Jagtial

ఈ నెల 15న.. మెట్‌పల్లిలోని మఠంవాడకు చెందిన మహిళపై దాడి ఘటన కర్ర లేదా రాళ్లతోనే జరిగిందని పోలీసులు చెప్పారు. చివరికి మహిళ తలలో బుల్లెట్‌ లేదా ఇనుప ముక్క బయటపడటంతో పోలీసు విచారణ ప్రశ్నార్థకంగా మారింది.

శనివారం సాయంత్రం మెట్‌పల్లిలోని ఆదర్శనగర్‌లో దాసరి రాజేంద్రప్రసాద్‌ అనే బిల్డర్‌ మృతి చెందాడు. ఆయన మెడలో ఉన్న చైన్‌ మాయం కావడం, తల వెనక బలంగా పదునైన ఆయుధంతో కొట్టిన ఆనవాళ్లు ఉండటం వంటి అంశాల గుర్తింపులో జాప్యం జరిగింది. నిబంధనల ప్రకారం మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు తరువాత హత్య కేసుగా మార్చారు. ఈ కాస్త జాప్యం నిందితుడు దూర ప్రాంతాలకు పరారై సమస్యను మరింత జఠిలం చేసేందుకు ఆస్కారం చిక్కుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.  

ఈ రెండు సంఘటనల్లోనూ పోలీసుల విచారణ సరైన సమయంలో.. సరైన రీతిలో జరగలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. సంఘటన జరిగిన సమయంలో కాస్త లోతుగా విచారణ జరిపితే ఆయా సంఘటనల పూర్వాపరాలు పూర్తిస్థాయిలో బయటపడే అవకాశాలు ఉంటాయి. 

కోరుట్ల/మెట్‌పల్లి: ఆలస్యం చేస్తే అమృతం విషంగా మారుతుందన్న నానుడి అందరికీ తెలిసిందే. నేర సంఘటనలు జరిగిన సమయంలో కారణాలు గుర్తించడంలో ఆలస్యం సమస్యను మరింత జఠిలం చేస్తుంది. మెట్‌పల్లిలో ఈనెల 15న మహిళపై దాడి జరిగిన సంఘటనలో ముగ్గురు ఉన్నట్లు బాధితురాలు చెబితే.. ఇద్దరిపైనే కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. బాధితురాలు చెప్పిన మరో వ్యక్తిని కేసులో ఎందుకు చేర్చలేదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దాడి సమయంలో పెద్దగా రేకుల చప్పుడు వచ్చిందని చుట్టుపక్కల వారు చెప్పినట్లు తెలిసింది. 

అది రేకుల చప్పుడు కాదని, ఏదైనా పేలిన శబ్దంగా అనుమానించడంలో అధికార యంత్రాంగం తాత్సారం చూపిందా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మహిళ తలలో దొరికిన ఇనప ముక్క దాదాపు బుల్లెట్టు అని నిర్ధారణకు వస్తున్నా.. ఫోరెన్సిక్‌ నివేదిక వచ్చేవరకూ విషయం తేటతెల్లం కాదు. ఒకవేళ బుల్లెట్‌గా తేలితే.. జరిగిన జాప్యం ఫలితంగా తపంచా లేదా రివాల్వర్‌.. ఎవరు..ఎక్కడి నుంచి తెచ్చారు..? ఎవరు దాడి సమయంలో కాల్చారు..? అనే విషయం తేల్చడంలో ఆలస్యంతోపాటు నిందితులు తప్పించుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

అనుమానం హత్యగా తేలింది
శనివారం సాయంత్రం మెట్‌పల్లిలోని ఆదర్శనగర్‌లో బిల్డర్‌ రాజేంద్రప్రసాద్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటన స్థలంలో రాజేంద్రప్రసాద్‌ తల వెనక భాగంలో పదునైన గాయం ఉంది. మొదట బిల్డింగ్‌పై నుంచి పడి మృతి చెందాడని అనుమానించారు. రాజేంద్రప్రసాద్‌ మెడలో ఉండాల్సిన బంగారు చైన్‌ ఎక్కడికి వెళ్లిందన్న విషయం ఆ సమయంలో పోలీసుల దృష్టికి రాలేదు. 

ఈ విషయం ఆదివారం బయటపడింది. రాజేంద్రప్రసాద్‌ వద్ద పనిచేసే పేయింటర్‌ తనకు సకాలంలో డబ్బులు చెల్లించలేదని గొడవ పడి అందుబాటులో ఉన్న పదునైన ఆయుధంతో బలంగా తల వెనక కొట్టాడు. దీంతో రాజేంద్రప్రసాద్‌ అక్కడిక్కడే మృతి చెందాడని పోలీసులు గుర్తించారు. పోలీసులు రాజేంద్రప్రసాద్‌ మృతి కేసును హత్యగా మార్చి విచారణ ప్రారంభించారు. మొత్తం మీద ఏదైనా నేర సంఘటనలు జరిగిన సమయంలో విచారణ లోతుగా జరిపితే బాధితులకు మేలు జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement