ప్రభుత్వ భూముల్లో ఈత వనాల పెంపకం | Sarvai Papanna Goud Statue unveiled in Nagarkurnoo | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూముల్లో ఈత వనాల పెంపకం

Jul 23 2024 1:11 AM | Updated on Jul 23 2024 1:11 AM

Sarvai Papanna Goud Statue unveiled in Nagarkurnoo

ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు..

నాగర్‌కర్నూల్‌లో సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహావిష్కరణ

సాక్షి, నాగర్‌కర్నూల్‌: అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి రాజ్యాధికారాన్ని సాధించిన యోధుడు సర్దార్‌ సర్వాయిపాపన్న గౌడ్‌ అని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం నాగర్‌కర్నూల్‌ జిల్లాకేంద్రంలో పాపన్న గౌడ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఈత వనాల పెంపకం కోసం గౌడ సొసైటీలకు ప్రభుత్వ భూములు కేటాయిస్తామని తెలిపారు. ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో విరివిగా ఈత వనాలను పెంచనున్నట్టు చెప్పారు. అలాగే సాగునీటి కాల్వల గట్లపై కూడా ఈత వనాలను పెంచుతామన్నారు. 

వైన్‌షాపుల కేటాయింపులో ప్రస్తుతం అమలులో ఉన్న 15 శాతం రిజర్వేషన్‌ను సొసైటీ సభ్యులకు వర్తింపజేసేలా కృషి చేస్తామని చెప్పారు. ఏళ్లుగా దాగి ఉన్న సర్వాయి పాపన్నగౌడ్‌ చరిత్రను బయటకి తెచ్చామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. గీత కార్మికులకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గౌడ కార్మికులకు రక్షణ కిట్లను అందిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి శాసనమండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌ కృతజ్ఞతలు తెలి పారు. ఈ కార్యక్రమంలో టీపీ సీసీ సీనియర్‌ నేత మధు యాష్కిగౌడ్, బీసీ సంఘాల నేత జాజాల శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement