
ఆదివారం ఆదిలాబాద్లోని ఓ చౌక ధరల దుకాణం వద్ద రేషన్ కార్డుదారుల పడిగాపులు
చాలాచోట్ల మొరాయించిన సర్వర్లు.. షాపుల మూసివేత
కేంద్రం, రాష్ట్ర కోటా కింద ఆరుసార్లు వేలిముద్రల సేకరణకు అధిక సమయం
రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజు అంతంత మాత్రంగా సన్నబియ్యం పంపిణీ
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలం సీజన్ను దృష్టిలో ఉంచుకొని జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ ఏకకాలంలో పంపిణీ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అవాంతరాల మధ్య అంతంతమాత్రంగా సాగింది. లబ్ధిదారుల నుంచి మూడు నెలలకు సంబంధించి ఆరుసార్లు వేలిముద్రలు తీసుకోవాల్సి రావడం క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలకు దారితీసింది. ఒక్కో లబ్ధిదారు నుంచి వేలిముద్రల సేకరణ, వేర్వేరుగా బియ్యం కాంటా కోసం సుమారు అరగంట సమయం పట్టింది. దీంతో లబ్ధిదారులు గంటలకొద్దీ క్యూలలో నిరీక్షించాల్సి వచ్చింది.
చాలా జిల్లాల్లో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈ–పీఓఎస్) పరికరాలు నెట్వర్క్ సమస్యలతో మొరాయించడంతో చేసేది లేక డీలర్లు దుకాణాలను మూసేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో లబ్ధిదారులు ఖాళీ సంచులతో ఇళ్లకు తిరిగి వెళ్లారు. ఇంకొన్ని జిల్లాల్లో రేషన్ షాపులకు సన్నబియ్యం స్టాక్ చేరుకోకపోవడంతో పంపిణీ సాధ్యంకాలేదు. వెరసి.. తొలిరోజు ఎక్కడా 10 శాతం మించి సన్నబియ్యం పంపిణీ సాధ్యం కాలేదు.
కేంద్రం.. రాష్ట్ర లెక్కల వల్లే..
రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుల్లో 55 లక్షలు కేంద్రం ఇచ్చిన ఎన్ఎస్ఎఫ్ఏ కార్డులుకాగా.. 32 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కార్డులు. ఎన్ఎస్ఎఫ్ఏ కార్డుదారులకు కేంద్రం ఇచ్చే 5 కిలోల బియ్యానికి రాష్ట్రం అదనంగా కిలో బియ్యం కలిపి ఇస్తోంది. దీంతో ప్రతి నెలా లబ్ధిదారుల నుంచి రేషన్ డీలర్లు రెండుసార్లు వేలిముద్రలు సేకరిస్తున్నారు. తాజాగా మూడు నెలల రేషన్ను ఏకకాలంలో ఇవ్వాల్సి రావడంతో ఒక్కో లబ్దిదారు చేత డీలర్లు ఆరుసార్లు వేలిముద్ర వేయించాల్సి రావడం సాంకేతిక సమస్యలకు కారణమైంది.
నేటి నుంచి పూర్తిస్థాయిలో పంపిణీ చేస్తామన్న అధికారులు
తొలిరోజు ఎదురైన సమస్యలను అధిగమించి సోమవారం నుంచి పూర్తిస్థాయిలో రేషన్ బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేశామని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 30 వరకు మూడు నెలల బియ్యం పంపిణీ కొనసాగుతుందని.. అందువల్ల లబ్ధిదారులు కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు సాంకేతిక సమస్యలను నివారించేందుకు లబ్ధిదారులంతా వారికి కేటాయించిన తేదీల ప్రకారమే షాపులకు రావాలని రేషన్ డీలర్లు విజ్ఞప్తి చేశారు.