కడుపులోని బిడ్డకు డీఎన్‌ఏ పరీక్ష కోరిన భర్త..! | Pregnant Woman Ends Life Over DNA Test Demand | Sakshi
Sakshi News home page

కడుపులోని బిడ్డకు డీఎన్‌ఏ పరీక్ష కోరిన భర్త..!

Jun 27 2026 11:00 AM | Updated on Jun 27 2026 11:01 AM

Pregnant Woman Ends Life Over DNA Test Demand

మెదక్ జిల్లా: అత్తింటి వేధింపులు భరించలేక ఐదు నెలల గర్భిణి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మండలంలోని గడిపెద్దాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం, వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలం మొత్తుకపల్లి గ్రామానికి చెందిన సుష్మిత (23)కు గడిపెద్దాపూర్ గ్రామానికి చెందిన గాజుల అభిలాష్తో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది.

ప్రస్తుతం ఐదు నెలల గర్భిణిగా ఉన్న సుష్మితపై భర్త అభిలాష్, అత్త శశిరేఖ అనుమానం వ్యక్తం చేస్తూ గర్భంలోని శిశువుకు డీఎన్‌ఏ (DNA) పరీక్ష చేయించాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించడంతో కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఈ వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన సుష్మిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.

మృతురాలి తల్లి జానాబాయి తన కుమార్తె మరణానికి భర్త అభిలాష్, అత్త శశిరేఖలే కారణమని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement