
హైదరాబాద్కు ఎలక్ట్రిక్ బస్సుల సరఫరా కసరత్తు ప్రారంభించిన కేంద్రం
దశలవారీగా బస్సుల సరఫరా
10 కొత్త డిపోల కోసం స్థల సేకరణ మొదలుపెట్టిన ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరం నుంచి ఆర్టీసీ డీజిల్ బస్సులను పూర్తిగా తొలగించే ప్రక్రియ మొదలు కాబోతోంది. ఇందుకు అవసరమైన 2,800 బస్సులను కేంద్రప్రభుత్వం పీఎం ఈ–డ్రైవ్ పథకంలో భాగంగా అందించనుంది. తాజాగా కేంద్రప్రభుత్వం ఇందులో 2 వేల బస్సులను మంజూరు చేసినట్టు అధికారికంగా ప్రకటించింది. మిగతావాటిని తదుపరి మంజూరు చేయనుంది. మంజూరైన బస్సులకు వచ్చే నెలలో టెండర్లు పిలవబోతోంది.
నాలుగు ప్రాంతాల్లో అనువైన స్థలాలు
ప్రస్తుతం సిటీలో దాదాపు 2,500 బస్సులు నడుస్తున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు సమకూరిన తర్వాత డీజిల్ బస్సులను రాష్ట్రంలోని ఇతర డిపోలకు బదలాయిస్తారు. ఉన్న బస్సులు నగర ప్రజల అవసరాలను తీర్చలేకపోతున్నందున, ఎలక్ట్రిక్ బస్సులను పెంచాలని, అదనంగా 300 బస్సులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. బస్సుల సంఖ్య పెరిగితే ఉన్న డిపోలు సరిపోవు. చార్జింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి ఉన్నందున సాధారణ బస్సులతో పోలిస్తే ఎలక్ట్రిక్ బస్సులకు ఎక్కువ స్థలం అవసరం. దీంతో నగరంలో అదనంగా మరో పది డిపోలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు.
టెండర్ల ప్రక్రియ పూర్తయిన మూడు నెలల్లో బస్సుల రాక మొదలవుతుంది. దీంతో కొత్త డిపోల ఏర్పాటుకు ఆర్టీసీ చర్యలు ప్రారంభించింది. శంషాబాద్, శామీర్పేట, తుర్కయాంజాల్, హయత్నగర్ ఇలా.. పలు ప్రాంతాల్లో ఆర్టీసీకి ఉన్న సొంత స్థలాలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే నాలుగు ప్రాంతాల్లో సొంత భూములను అనువుగా ఉన్నట్టు గుర్తించింది. ఒక్కో డిపోలో 60–80 వరకు బస్సులు ఉంచాలని భావిస్తోంది. ప్రస్తుతం నగరంలో 550 ఎలక్ట్రిక్ బస్సులు సరఫరా చేయాల్సి ఉండగా, విడతల వారీగా 275 బస్సులు వచ్చాయి. కానీ, ప్రస్తుతం చైనాతో మన దేశానికి సంబంధాలు సానుకూలంగా లేకపోవటం మిగతా బస్సుల సరఫరాపై ప్రభావం చూపుతోంది. డిసెంబర్ వరకు గానీ మళ్లీ సరఫరా ఉండకపోవచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.