వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. | One Man Ends Of Life In Sangareddy | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..

Jan 29 2025 1:59 PM | Updated on Jan 29 2025 3:45 PM

One Man Ends Of Life In Sangareddy

 ప్రియుడితో కలిసి భర్త హత్య

మృతదేహాన్ని గ్రామ శివారులో  పడేసిన వైనం 

ఏమీ తెలియనట్లు అదృశ్యమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు  

భార్యతోపాటు నలుగురిని  అదుపులోకి తీసుకున్న పోలీసులు 

హత్నూర మండలం రెడ్డి ఖానాపూర్‌లో ఘటన  

హత్నూర(సంగారెడ్డి): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తనే హత్య చేసింది భార్య. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం రెడ్డి ఖానాపూర్‌లో చోటు చేసుకుంది. సోమవారం ఎస్‌ఐ సుభాష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా బిక్నూర్‌ మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన మల్లె నారాయణ(42) మూడేళ్ల కిందట ఉపాధి నిమిత్తం హత్నూర మండలం రెడ్డి ఖానాపూర్‌ గ్రామానికొచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. గ్రామంలోనే ఎఫ్‌పీఓ (ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌) కార్యాలయంలో సీఈవోగా పని చేస్తున్నాడు. భార్య లక్ష్మీ సొంత మల్లుపల్లి గ్రామంలోనే ఉండేది.

 నాలుగు రోజుల కిందట భర్త వద్దకు రెడ్డి ఖానాపూర్‌ గ్రామానికి వచ్చింది . లక్ష్మీకి బిక్నూర్‌ మండలం రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన బీజేపీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు కడారి రాకేశ్‌తో వివాహేత సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయం తెలిసి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఎలాగైన భర్తను అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది. పథకం ప్రకారం శుక్రవారం రాత్రి ప్రియుడు రాకేశ్, బిక్నూర్‌ గ్రామానికి చెందిన సాగర్‌ రమేశ్, డప్పు శ్రీకాంత్, కడారి శ్రీకాంత్‌తో కలిసి భర్త నారాయణను రెడ్డి ఖానాపూర్‌ గ్రామ శివారులోని సొసైటీ కార్యాలయం వద్ద హత్య చేసి మృతదేహాన్ని పల్పనూరు గ్రామ శివారులో పడి వేశారు. 

మరుసటి రోజు (శనివారం) ఏమీ తెలియనట్లు భర్త కనిపించడం లేదని హత్నూర పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  సోమవారం గ్రామ ఉదయం శివారులో మృతదేహం ఉందనే సమాచారం మేరకు ఘటన స్థలాన్ని పటాన్‌ చెరువు డీఎస్పీ రవీందర్‌ రెడ్డి, సీఐ నదిముద్దీన్‌ పరిశీలించారు. అనుమానితురాలుగా ఉన్న భార్యను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా నేరం ఒప్పుకుంది. లక్ష్మీ, రాకేశ్‌తోపాటు వీరికి సహకరించిన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ సుభాష్‌ తెలిపారు. లక్ష్మీ సైతం బీజేపీ బీసీ మహిళా మండలాధ్యక్షురాలు పని చేస్తున్నట్లు పేర్కొన్నారు.

హత్య కేసులో నిందితుల రిమాండ్‌
హత్నూర(సంగారెడ్డి): భర్తను హత్య చేయించిన భార్యతోపాటు ఇందుకు సహకరించిన నలుగురిని మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు జిన్నారం సీఐ ఎండీ నయీముద్దీన్‌ తెలిపారు. హత్నూర పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ సుభాష్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన మల్లె నారాయణ (42) వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్య లక్ష్మీనర్సవ్వ, ప్రియుడు కడారి రాకేష్‌, చెట్లపల్లి సాగర్‌, కడారి శ్రీకాంత్‌, డప్పు శ్రీకాంత్‌ కలిసి హత్య చేయించిన విషయం తెలిసిందే. పథకం ప్రకారం తన ప్రియుడైన రాకేశ్‌కు రూ.40 వేలు సుపారీ ఇచ్చింది. లక్ష్మీ నర్సవ్వ ఖానాపూర్‌లో ఉండే భర్త దగ్గరకు మూడు రోజుల కిందట వచ్చింది. 

అతడు ఆఫీసులో ఉండగానే తాగడానికి కల్లు తెమ్మని చెప్పింది. అతడు వచ్చే లోపు పథకం ప్రకారం నలుగురు నిందితులు వచ్చి ఆఫీసులోని ఓ గదిలో దాక్కున్నారు. నారాయణ కల్లు తీసుకొని రాగానే వారి వెంట తెచ్చుకున్న కత్తి, కట్టే ఇనుప రాడుతో ఒక్కసారిగా దాడి చేసి నరికి చంపేశారు. ఈ హత్యపై ఎస్సై సుభాష్‌ తనదైన శైలిలో విచారణ చేయగా భార్య లక్ష్మీతోపాటు మరో నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కారు, కత్తి కట్టే ఇనుప రాడును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement