ఖరీఫ్ సన్నద్ధతపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించిన మంత్రి తుమ్మల
తక్కువ నీటితో సాగయ్యే కందులు, పెసలు, మినుములు వంటి పంటలను ప్రోత్సహిస్తున్నాము
ఈ ఖరీఫ్ కు 87 లక్షల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి
రైతులకు మరింత సౌకర్యవంతంగా ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్లో మార్పులు
ఎల్.ని.నో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల ప్రణాళిక సిద్ధం చేసిన వ్యవసాయశాఖ
వాతావరణ సమాచారాన్ని నేరుగా రైతులకు చేరవేసే తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమం విజయవంతం
ఖరీఫ్ సన్నద్ధతపై ఈ రోజు ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. ఎల్నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి ఏప్రిల్ నెలలోనే వ్యవసాయశాఖ అధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, వాతావరణ శాఖ నిపుణులతో సమీక్ష నిర్వహించి ముందస్తు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. వర్షాలు ఆలస్యమైనా, తక్కువగా నమోదైనా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ సాగు ప్రణాళికలను రూపొందించినట్లు పేర్కొన్నారు.
వరి పంటలపై అధికంగా ఆధారపడకుండా రైతులను పంటల వైవిధ్యీకరణ వైపు ప్రోత్సహించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కందులు, పెసలు, మినుములు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, నువ్వులు, ఆముదం వంటి తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. విత్తనాల కొరత తలెత్తకుండా ఈ ఖరీఫ్ సీజన్కు 87.49 లక్షల క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచామని, ముఖ్యంగా కందులు, జొన్నలు, మొక్కజొన్న, సజ్జలు వంటి ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను జిల్లాల్లో ముందుగానే నిల్వ చేసినట్లు మంత్రి వివరించారు.
రాష్ట్రంలోని రైతులకు ఎరువుల లభ్యతను మరింత సులభతరం చేయడం, పంపిణీ ప్రక్రియలో పారదర్శకతను పెంచడం లక్ష్యంగా వ్యవసాయశాఖ పలు కీలక చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. రబీ సీజన్లో రైతుల నుంచి వచ్చిన సూచనలు, అభిప్రాయాల ఆధారంగా రాష్ట్ర ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్లో పలు మెరుగుదలలు చేసినట్లు వెల్లడించారు. జిల్లా వారీగా డీలర్ల స్టాక్ నిర్వహణ, మండల మ్యాపింగ్ సదుపాయాలతో పాటు మీ సేవ కేంద్రాల ద్వారా కూడా ఎరువుల బుకింగ్ సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక హెల్ప్లైన్ను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. యాప్ వినియోగంతో ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద రద్దీ తగ్గడంతో పాటు పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మారుతుందని మంత్రి తెలిపారు.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో ఎల్నినో ప్రభావం కనిపించే అవకాశం ఉన్నందున వ్యవసాయశాఖ ముందస్తుగా పంటల ప్రణాళికను సిద్ధం చేసిందని మంత్రి తెలిపారు. వర్షపాతంలో అనిశ్చిత పరిస్థితులు, ఉష్ణోగ్రతల పెరుగుదల వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలు, విత్తనాలు, ఎరువుల లభ్యత, రైతులకు సాంకేతిక సూచనలపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు వెల్లడించారు. రైతులు స్థానిక వాతావరణ పరిస్థితులను గమనిస్తూ వ్యవసాయశాఖ సూచనలను పాటించాలని కోరారు.
రైతులకు ఖచ్చితమైన, సమయానుకూలమైన వాతావరణ సమాచారాన్ని అందించేందుకు వ్యవసాయ శాఖ “తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమం”ను అమలు చేస్తున్నదని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మండలాల వారీగా వర్షపాతం, ఉష్ణోగ్రతలు, గాలి వేగం తదితర వాతావరణ వివరాలు రైతులకు నేరుగా వాట్సాప్ సందేశాల ద్వారా చేరుతున్నాయని చెప్పారు. రైతులు విత్తనాలు వేయడం, ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, పంట సంరక్షణ వంటి అంశాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు.
తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమానికి రైతుల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 28 లక్షల మందికి పైగా రైతులకు వాతావరణ సమాచార సందేశాలు పంపించినట్లు చెప్పారు. 71 శాతం డెలివరీ రేటుతో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, పంట నష్టాలను తగ్గించడం లక్ష్యంగా ఇటువంటి సాంకేతిక ఆధారిత కార్యక్రమాలను మరింత విస్తరించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.


