మావోయిస్టుల లొంగు‘బాట’ | Maoists Surrender To police in Bhadradri | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల లొంగు‘బాట’

Apr 21 2025 5:17 AM | Updated on Apr 22 2025 3:06 PM

Maoists Surrender To police in Bhadradri

పెరిగిన నిర్బంధంతో ఉక్కిరిబిక్కిరి.. కేడర్‌ను కాపాడుకోవడానికి లొంగుబాటు వ్యూహం 

సరెండర్‌ అవ్వాలని కేడర్‌కు సూచిస్తున్న అగ్రనేతలు.. భారీ ఎత్తున లొంగిపోతున్న కిందిస్థాయి కేడర్‌

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: వరుస ఎన్‌కౌంట ర్లు, తీవ్ర నిర్బంధంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టులు లొంగుబాటు వ్యూహాన్ని ఎంచుకున్నారా? ప్రస్తుత పరిస్థితుల్లో బతికి ఉండాలంటే ప్రభుత్వానికి లొంగిపోవటం ఒక్కటే మార్గమని భావిస్తున్నారా? తాజా పరిణామాలు గమనిస్తే ఇది నిజమే నని అంటున్నారు విశ్లేషకులు. నెల రోజులుగా మావో యిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యులు, జనమిలీషియా, చేతన నాట్య మండలికి చెందిన వారు భారీ ఎత్తున లొంగిపోతున్నారు. ఓవైపు శాంతి చర్చల అంశంపై స్పష్టత రాకముందే లొంగుబాట్లకు మావోయిస్టులు ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది.  

అష్టదిగ్బంధనం.. 
మావోయిస్టులకు కేంద్రస్థానమైన బస్తర్‌ అరణ్యంపై ప్రభుత్వ దళాలు ఆపరేషన్‌ కగార్‌ పేరుతో విరుచుకుపడుతున్నాయి. వరుసగా చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్లతో ఇప్పటివరకు 400 మందికి పైగా తమ సభ్యులు మరణించినట్టు మావోయిస్టులే ప్రకటించారు. కేంద్ర కమిటీ సభ్యుడు చలపతితోపాటు కీలక నేతలైన రేణుక, ఊర్మిళ, మాచర్ల ఏసోబు వంటి అగ్రనేతలు మృతిచెందడం ఆ పార్టీకి భారీ నష్టాన్ని కలిగించింది. అడవుల్లో ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి చొప్పున భద్రతా దళాలు బేస్‌ క్యాంప్‌ ఏర్పాటు చేయటంతో మావోయిస్టుల కదలికలు పరిమితమయ్యాయి.  

లొంగిపోవాలని నేతల పిలుపు..! 
నిర్బంధం పెరిగిపోవడంతో మావోయిస్టు ముఖ్య నాయకులు, సాయుధ దళాలు ఒకటిరెండు ప్రాంతాలకే పరిమితమయ్యాయి. భద్రత దృష్ట్యా కీలక నేతలు కిందిస్థాయి కేడర్‌ను కలిసే అవకాశం దక్కడం లేదు. దీంతో పార్టీ విస్తరణ, జనతన సర్కార్‌ నిర్వహణ కష్టంగా మారాయి. మరోవైపు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న నాయకులకు వైద్యసాయం అందించడం కత్తి మీద సాములా మారింది. దీంతో మావోయిస్టు పార్టీ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఓవైపు శాంతి చర్చలకు పిలుపునివ్వడంతోపాటు కింది స్థాయి కేడర్‌ను ప్రభుత్వానికి లొంగిపొవాలని సూచించినట్టు తెలుస్తోంది. తిరిగి అనుకూల సమయం వచ్చినప్పుడు పార్టీని విస్తరించుకుందామని చెబుతున్నట్లు సమాచారం.  

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో సీఆర్పీఎఫ్ భారీ ఆపరేషన్

ఛత్తీస్‌గఢ్‌ నుంచి బయటకు.. 
లొంగుబాటుకు ప్రయత్నిస్తున్న నక్సల్స్‌లో చాలామంది బస్తర్‌ ఎన్‌కౌంటర్లలో చనిపోతుండడంతో అక్కడ లొంగుబాటు ప్రక్రియకు ఆదిలోనే బ్రేకులు పడ్డాయి. దీంతో ఛత్తీస్‌గఢ్‌లో లొంగుబాటు సేఫ్‌ కాదని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వైపునకు తరలివస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే 203 మంది మావోయిస్టులు లొంగిపోయారు. గతేడాది ఈ సంఖ్య 36 మాత్రమే. గత మార్చి 15న ఒకేసారి 64 మంది లొంగిపోగా, ఏప్రిల్‌ 5న రికార్డు స్థాయిలో 86 మంది లొంగిపోయారు. ఈ నెల 12న ములుగులో 22 మంది లొంగిపోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. మరోవైపు ఏపీలోని అల్లూరి జిల్లాలో ఈ నెల 5న 11 మంది లొంగిపోయారు. 

రూటు మార్చిన ఛత్తీస్‌గఢ్‌ 
లొంగిపోయే మావోయిస్టుల కోసం ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఏప్రిల్‌ 10న కొత్త పథకం అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం లొంగిపోయిన మావోయిస్టులకు రూ.50 వేల ఆర్థిక సాయాన్ని 120 రోజుల్లోగా అందిస్తామని పేర్కొంది. అదే విధంగా ప్రతీ మూడు నెలలకు ఒకసారి రూ.10 వేల వంతున స్టైఫండ్‌ అందించడం, గ్రామీణ ప్రాంతాల్లో అయితే వ్యవసాయ భూమి, పట్టణ ప్రాంతాల్లో అయితే ఇంటి స్థలాలు ఇస్తామని ప్రకటించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement