సాధారణ ఫోన్ కాల్ సంభాషణల రికార్డులు రచ్చకెక్కి వివాదాలకు కారణమవుతుండడంతో ఇప్పుడు వాట్సాప్ కాల్ ట్రెండ్ నడుస్తోంది. నేతలతోపాటు అధికారులు సైతం వాట్సాప్ కాల్స్ మాత్రమే మాట్లాడడానికి మొగ్గు చూపుతున్నారు.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: సరదాగానో, కోపంతో నో మాట్లాడిన మాటల రికార్డులు బయటకు రావడం, అవి వివాదాలకు కారణమవుతుండడంతో చా లామంది సాధారణ ఫోన్ కాల్స్ మాట్లాడాలంటే జంకుతున్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు, అధికారులు ఎవరితోనైనా కాల్స్ మాట్లాడేటపుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొందరైతే సాధారణ కాల్స్ వస్తే కట్ చేస్తున్నారు. వాట్సాప్ వాయిస్ కాల్స్ చేస్తేనే స్పందిస్తున్నారు.
రచ్చకెక్కిన సందర్భాలెన్నో..
కొన్నాళ్ల క్రితం ఓ ఎమ్మెల్యే అధికారితో ఫోన్ మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దలపై అసహనం వ్యక్తం చేసిన దానిని ఎవరో వీడియో రికార్డు చేశారు. అది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. మరో నేత మాట్లాడిన మాటలు సైతం దుమారం రేపాయి. ఇటీవల అధికార కాంగ్రెస్ పారీ్టలో గ్రూపు గొడవల నేపథ్యంలో ఓ వాయిస్ కాల్ రికార్డ్ వైరల్ అయ్యి ఆ పార్టీలో రచ్చకు దారితీసిన విషయం తెలిసిందే. చివరికి అది ఏఐ ద్వారా సృష్టించిన ఫేక్ కాల్ అంటూ పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులతో పాటు జిల్లా స్థాయి అధికారులు సైతం నార్మల్ కాల్స్ తక్కువగా మాట్లాడుతున్నారు. వాట్సాప్ వాయిస్ కాల్స్కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు.
వాట్సాప్ కాల్లో మాట్లాడుతున్నా..
సాధారణ ఫోన్ కాల్స్ రికార్డు చేస్తుండడం, అవి వివాదాలకు కారణమవుతుండడంతో చాలామంది వాట్సాప్ ద్వారా వాయిస్ కాల్స్ మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో తాము వాట్సాప్ కాల్ మాట్లాడేటపుడు చుట్టుపక్కల ఉన్న వారు ఎవరైనా వీడియో రికార్డు చేస్తున్నారేమోనని కూడా అటూ ఇటూ చూసుకుంటున్నారు. కొన్ని సందర్బాల్లో తమ వద్దకు వచ్చే వారు ఫోన్ వీడియో రికార్డు ఆన్ చేసుకుని జేబులో వేసుకుని వస్తున్నారనే అనుమానాలతో ప్రజాప్రతినిధులు, నాయకులు మొబైల్స్ను బయటు పెట్టి రావాలని సూచిస్తున్నారు.
కాల్ లిఫ్ట్ చేయాలంటే...
సార్వత్రిక ఎన్నికల సమయంలో పలువురి ఫోన్లు ట్యాప్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు కొందరు కాల్స్ రికార్డు చేస్తుండడంతో ఏదైనా పొరపాటు మాట్లాడినా, ఎవరి గురించైనా చెడుగా మాట్లాడినా.. ఆ కాల్ రికార్డులు బయటకు వస్తున్నాయి. ఏదో టెన్షన్లోనో, ఒత్తిడిలోనో ఉన్నపుడు ఎదుటి వారు మాట్లాడే మాటలు కోపం తెప్పిస్తే నోరు జారుతుంటారు. అలాగే కొందరు మద్యం సేవించిన తర్వాత కాల్స్ చేసి విసిగిస్తుంటారు.
అలాంటి కాల్స్తోనూ సమస్యలు ఎదురవుతుంటాయి. పలు సందర్భాలలో మాట్లాడిన మాటల రికార్డులు లీకై వివాదాలూ సృష్టించాయి. దీంతో ప్రజాప్రతినిధులు, నాయకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరు కాల్ చేసినా లిఫ్ట్ చేయడానికి వెనకాముందవుతున్నారు. సాధారణ కాల్స్ విషయంలో ఆచితూచి మాట్లాడుతున్నారు. కొందరు తమ ఫోన్కు వచ్చే కాల్స్ను కట్ చేస్తున్నారు. మరికొందరు పీఏలు, అనుచరుల ఫోన్ల నుంచి మాట్లాడుతున్నారు.


