
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని పరామర్శిస్తున్న కేటీఆర్
తెలంగాణ ప్రజలు చూసేలా ప్రత్యక్ష ప్రసారం చేయిద్దాం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘రేవంత్రెడ్డి గారూ.. ఓటుకు నోటు కేసులో మీరు..ఫార్ములా ఈ అంశంలో నేను.. ఇద్దరమూ ఏసీబీ విచారణను ఎదుర్కొంటున్నాం. న్యాయమూర్తి సమక్షంలో మనిద్దరం లై డిటెక్టర్ పరీక్ష ఎందుకు చేయించుకోకూడదు. ఈ పరీక్షను టెలివిజన్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తే అసలు దోషులు ఎవరో తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. నాతోపాటు లై డిటెక్టర్ పరీక్షకు హాజరయ్యే దమ్ముందా’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాలు చేశారు. శుక్రవారం ‘ఎక్స్’లో కేటీఆర్ స్పందించారు. ‘ప్రభుత్వం నడిపే చేవలేనప్పుడు ప్రజలతో సర్కస్ చేస్తూ వారి దృష్టిని మళ్లిస్తారు.
కానీ కాంగ్రెస్ పార్టీతోపాటు దాని జోకర్ సీఎం చేసే హడావుడి మమ్ములను అడ్డుకోలేవు. సోమవారం ఉదయం 10 గంటలకు ఫార్ములా–ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ నుంచి పిలుపు వచ్చింది. చట్టానికి కట్టుబడిన పౌరుడిగా విచారణకు హాజరై ఏసీబీ అధికారులకు పూర్తిగా సహకరిస్తాను. నల్లటి బ్యాగ్ నిండా డబ్బుతో దొరికి పదేళ్లు పూర్తి చేసుకున్నదెవరో చెప్పగలరా. ఓ వైపు రాష్ట్రం దివాలా తీసిందని చెబుతున్న సీఎం రేవంత్.. పదే పదే విచారణలు, ప్రచారాలు పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఎందుకు వృథా చేస్తున్నారు’అని కేటీఆర్ ప్రశ్నించారు.
విద్యా వ్యవస్థపై బాధ్యత లేదు
రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కూడా కుంటుపడిందని కేటీఆర్ ‘ఎక్స్’లో విమర్శించారు. దీని పట్ల ప్రభుత్వానికి బాధ్యత లేదన్నారు. వానాకాలం సీజన్ మొదలవుతున్నా రైతుభరోసా అమలు విషయంలో ప్రభుత్వానికి ప్రణాళిక లేదని మండిపడ్డారు. పాఠశాలలు పునః ప్రారంభమైనా పాలకులు నిర్లక్ష్యం వీడటం లేదన్నారు.
ఎమ్మెల్యే పల్లాకు పరామర్శ
సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని కేటీఆర్ పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకొని తిరిగి ప్రజాక్షేత్రంలో చురుగ్గా పాల్గొనాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఆస్పత్రికి వెళ్లిన వారిలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, తాతా మధు, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, సండ్ర వెంకటవీరయ్య ఉన్నారు.