ప్రణీత్‌రావు పిటిషన్‌లో తీర్పు రిజర్వు | Judgment reserved in Praneet Raos petition | Sakshi
Sakshi News home page

ప్రణీత్‌రావు పిటిషన్‌లో తీర్పు రిజర్వు

Mar 21 2024 2:25 AM | Updated on Mar 21 2024 2:25 AM

Judgment reserved in Praneet Raos petition - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం తన విచారణ జరగడం లేదంటూ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌లో వాదనలు ముగించిన హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శ కాలను పాటించడం లేదని, పీఎస్‌లో నిద్రపోవడానికి సరైన సౌకర్యాలు లేవని, విచారణ పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరడంతోపాటు పోలీస్‌ కస్టడీ ఇస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రణీత్‌ హైకోర్టులో సవాల్‌ చేసిన విషయం తెలిసిందే.

పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. ‘24 గంటలూ ప్రణీత్‌రావును పోలీసులు విచారిస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాల్సి ఉన్నా.. దాన్ని పాటించడంలేదు. ప్రణీత్‌ పరువుకునష్టం కలిగించేలా అధికారులు వివరాలు మీడియాకు లీక్‌ చేస్తున్నారు’ అని చెప్పారు.

అనంతరం పీపీ పల్లె నాగేశ్వర్‌రావు వాదిస్తూ.. ‘పిటిషనర్‌ న్యాయవాది వాదనలు సరికాదు. 2023లో అక్రమంగా ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్‌ చేశారు. ఇది చాలా తీవ్ర నేరం. నిబంధనల మేరకే ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తోంది. సాక్ష్యాలను అందించేందుకే రమేశ్‌ విచారణ జరిగే ప్రాంతానికి వచ్చారు తప్ప.. విచారణలో పాల్గొనలేదు’ అని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును రిజర్వు చేశారు. గురువారం తీర్పు వెల్లడించే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement