సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్కు ఏర్పాట్లు దాదాపుగా పూర్తైనట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ప్రకటించారు. యూసఫ్గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం డీఆర్సీ (Distribution, Reception and Counting Center) నుంచి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల తరలింపు ప్రక్రియ నడుస్తోందని ఆయన అన్నారు.
సిబ్బందికి ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రిని పంపిణీ ప్రాసెస్ నడుస్తోందని ఆర్వీ కర్ణన్ అన్నారు. ఈరోజు సాయంత్రం కల్లా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలతో సహా సిబ్బంది చేరుకుంటారు. ఒక్కో అభ్యర్థికి పోలింగ్ ఏజెంట్ పాస్ ఇస్తున్నాం. ఈ ఉప ఎన్నిక కోసం తొలిసారి డ్రోన్ల ద్వారా సెక్యూరిటీ మానిటరింగ్ చేయబోతున్నాం. అభ్యర్థులు ఎక్కువ ఉన్నందునే సాయంత్రం ఆరు గంటల దాకా పోలింగ్ పొడిగించాం అని తెలిపారాయన.
రేపు(మంగళవారం) ఉదయం 7 నుంచి సాయంత్రం 6 దాకా పోలింగ్ జరగనుంది. 3 వేల మంది పోలింగ్ సిబ్బంది, 2 వేల మంది పోలీసులతో కలిపి మొత్తం 5 వేల మంది పోలీసులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విధుల్లో ఉన్నారు. కేంద్ర బలగాలు 800 మందితో బందోబస్తు కల్పించారు. నియోజకవర్గంలోని 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి.. 144 సెక్షన్ విధించారు. పోలింగ్ పర్యవేక్షణ కోసం 45 ఫ్లైయింగ్ స్క్వాడ్ టీంలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 230 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు. ఎంసీసీ నిబంధనలు అతిక్రమించిన 27 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీత బరిలో ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4 లక్షల 1,365 మంది ఓటర్లు ఉన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో నాలుగు ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి.


