పాపతో బంధం.. వీడ్కోలు వేళ భావోద్వేగం | Jangaon District kids incident | Sakshi
Sakshi News home page

పాపతో బంధం.. వీడ్కోలు వేళ భావోద్వేగం

Jun 5 2026 9:52 AM | Updated on Jun 5 2026 9:55 AM

Jangaon District kids incident

జనగామ: తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన ఓ పసికందుకు వైద్యులే అమ్మానాన్నలుగా మారి 72 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడిన మానవీయ ఘటన జనగామ చంపక్‌హిల్స్‌ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్‌)లో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా తీర్చిదిద్దిన వైద్యులు గురువారం శిశుగృహకు అప్పగించారు. ఈ సమయంలో భావోద్వేగానికి గురయ్యారు. లింగాలఘనపురం మండలం (ఏపీ వసల కూలీలు) కళ్లెం గ్రామానికి చెందిన తిక్కవరపు పద్మ, నరేశ్‌ దంపతులు ఇటుక బట్టీలో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. 


అనావిుకను శిశుగృహ సిబ్బందికి అప్పగిస్తున్న వైద్యులు 

ఈ ఏడాది మార్చి 23న పద్మ ఐదో సంతానంగా ఆడశిశువుకు జన్మనిచ్చింది. కేవలం 1.24 కిలోల బరువు, చిన్న ఆరోగ్య సమస్యలతో జన్మించిన ఆ చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో ఎస్‌ఎసీయూలో ఇన్నాళ్లు చికిత్స అందించారు. అయితే ఆడపిల్ల కావడం, అత్యల్ప బరువుతో జన్మించడం వంటి కారణాలతో డెలివరీ జరిగిన వారం రోజులకే తల్లిదండ్రులు పాపను ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఎంసీహెచ్‌ సూపరింటెండెంట్‌ రాజలింగం ఆధ్వర్యంలో, డిప్యూటీ సూపరింటెండెంట్‌ మధుసూధన్‌రెడ్డి పర్యవేక్షణలో వైద్యులు, నర్సులు, సిబ్బంది ఆ చిన్నారికి అండగా నిలిచారు. 

పాపకు ‘అనావిుక’ అని పేరు పెట్టి నెల బర్త్‌డే వేడుకలతోపాటు మినీ బారసాల కార్యక్రమం కూడా నిర్వహించారు. పూర్తిగా ఆరోగ్యవంతురాలిగా మారడంతో డాక్టర్‌ మధుసూధన్‌రెడ్డి, చైల్డ్‌ వెల్ఫేర్‌ శాఖ సమన్వయంతో గురువారం హనుమకొండ శిశు గృహకుప్రత్యేక      వాహనంలో తరలించారు.

భావోద్వేగం
అయితే ఆ క్షణం అక్కడున్న ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసింది. 72 రోజులుగా తమ చేతుల్లో పెరిగిన చిన్నారిని పంపించే సమయంలో వైద్యులు, సిబ్బంది కన్నీరు పెట్టుకున్నారు. పేగుబంధం లేకపోయినా ప్రేమతో పెంచిన అనావిుకకు వీడ్కోలు పలుకుతూ వారు చూపిన ఆప్యాయత అందరినీ కదిలించింది. 

పేగుబంధం వదులుకుంది..! వైద్యబంధం అల్లుకుంది..!!


 

Advertisement
 
Advertisement
Advertisement