
జగిత్యాల జిల్లా హస్నాబాద్లో విషాదం
జగిత్యాల క్రైం: విదేశాల్లో ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సాధించాలని కలలుగన్న ఓ యువతి.. వీసా రాకపోవడం.. రూ.10 లక్షలు నష్టపోవడంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా కాంగాడిపాలెం గ్రామానికి చెందిన నల్లమోతు శ్రీనివాస్, వెంకటఅరుణ దంపతులు 25 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ గ్రామానికి వచ్చారు. గ్రామ శివారులో పప్పు మిల్లు లీజుకు తీసుకున్నారు. అలాగే పశువులు పెంచుకుంటూ జీవిస్తున్నారు.
వారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. పెద్ద కుమార్తె హర్షిత (25) డిగ్రీ పూర్తి చేసి అమెరికా వెళ్లేందుకు గుర్తుతెలియని వ్యక్తికి రూ.10 లక్షలు చెల్లించింది. అతడు వీసా తెప్పించకపోవడంతో కొద్దికాలంగా జర్మనీ వెళ్తానని తండ్రి శ్రీనివాస్తో చెబుతోంది. డబ్బు లేదని ఈ ప్రతిపాదనకు తండ్రి నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురైన హర్షిత ఈనెల 6న పప్పుమిల్లు వద్ద గడ్డిమందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి.. అక్కడినుంచి కరీంనగర్కు తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. మంగళవారం వేకువజామున మృతిచెందింది. కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు.