సాక్షి, హైదరాబాద్: నాచారం మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఒంటరి మహిళ అని సుజాతను గుర్తించి.. ఆమెతో మంచిగా ప్రవర్తించి.. నగల కోసం దారుణానికి ఒడిగట్టాడు ప్రధాన నిందితుడు అంజిబాబు. ఈ కేసులో పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
సుజాత భర్త, పిల్లలు కొన్నేళ్ల కిందట యాక్సిడెంట్లో మరణించారు. దీంతో ఆమె ఒంటరిగా ఉంటోంది. రెండు నెలల కిందట డ్రైవర్గా పని చేసే అంజిబాబు ఆమె ఇంట్లో అద్దెకు దిగాడు. అయితే సుజాత ప్రతీరోజూ ఒంటి నిండా బంగారం ధరించేది. ఇది గమనించిన అంజిబాబు.. ఆ నగల కోసం సుజాతను హత్య చేయాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో..
అమ్మా అని సుజాతను పిలుస్తూ దగ్గరయ్యాడు. ఆ పిలుపు విని ఆమె కూడా మోసపోయింది. ఈ నెల 18వ తేదీన కిచెన్లో ఉన్న సుజాతను వెనుక నుండి ముసుగు వేసి అంజి బాబు ఊపిరి ఆడకుండా చేసి ప్రాణం తీశాడు. ఆపై ఆమె ఒంటిపై నగలు తీసేసి.. ఇంటికి తాళం వేసి ఉడాయించాడు. అయితే.. పారిపోతే తన మీదకే నేరం వస్తుందని ఆలోచించి స్నేహితులతో కలిసి ఓ పన్నాగం పన్నాడు.
మృతదేహాన్ని మాయం చేయాలనీ తన స్నేహితులు దుర్గారావు, యువరాజులతో కలిసి ప్లాన్ వేశాడు. ఓ పెద్ద ట్రాలీ సూట్కేసు తెచ్చి.. అందులో సుజాత మృతదేహం కుక్కి రాజమండ్రి(ఆంధ్రప్రదేశ్) తీసుకెళ్లారు. ఆ బ్యాగును కోనసీమ రాజోలు దగ్గర గోదావరిలో పడేసి వచ్చారు.
సుజాత కనిపించకపోవడంతో బంధువులు ఆందోళన చెందారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. అయితే తనకు ఏం తెలియనట్లు.. ఆ బంధువులతో కలిసి అంజిబాబు ఆమె కోసం గాలించడం మొదలుపెట్టాడు. ఈలోపు..
సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు ఈ కేసును చేధించారు. అంజిబాబు, అతనికి సహకరించిన యువకుల్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించడంతో నేరం ఒప్పుకున్నారు. వాళ్లు ఇచ్చిన సమాచారంతో గోదావరి నది నుంచి ట్రాలీ బ్యాగ్ను వెలికి తీశారు. అందులోంచి సుజాత మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం పంపారు. నిందితుల నుంచి నాలుగు బంగారు గాజులు, చెవి దిద్దులు స్వాధీనం చేసుకున్నారు.


