వేగం పుంజుకున్న యాసంగి పనులు
అన్ని జిల్లాల్లో దుక్కులు దున్ని నార్లు పోసిన రైతులు
ఈసారి 68.67 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా
తగ్గిన శనగ, వేరుశనగ– పెరిగిన జొన్న, మొక్కజొన్న
యూరియా కోసం తప్పని తిప్పలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి పనులు వేగం పుంజుకున్నాయి. కృష్ణా, గోదావరి నదీ జలాల దిగువన ఉన్న పొలాలతో పాటు చెరువులు, బావుల కింద సాగయ్యే పొలాల్లో నాగళ్లు, ట్రాక్టర్ల సవ్వడులు పెరిగాయి. వరితోపాటు జొన్న, మొక్కజొన్న పంటలను మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఆదిశగా దృష్టి సారించారు. పంటల వైవిధ్యంపై ప్రభుత్వం, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ, సంప్రదాయ పంటలు, తృణ ధాన్యాల వైపు రైతులు ఆసక్తి చూపడం లేదు. మహబూబ్నగర్, రంగారెడ్డి, మెదక్ ఉమ్మడి జిల్లాలతోపాటు మరికొన్ని జిల్లాల్లో రైతులు గతంలో సాగుచేసే శనగ, వేరుశనగ పంటల దిక్కు కూడా చూడటం లేదు. ఈసారి 68.67 లక్షల ఎకరాల విస్తీర్ణంలో యాసంగి పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే గత సంవత్సరం యాసంగిలో 79.54 లక్షల ఎకరాల్లో పంటలు సాగైన నేపథ్యంలో ఈసారి కూడా ఆ స్థాయిలోనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటి వరకు 17.05 లక్షల ఎకరాల్లో
డిసెంబర్ రెండో వారం నుంచి రాష్ట్రంలో దుక్కులు దున్నే కార్యక్రమం మొదలైంది. ఇప్పటివరకు 17.05 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. ఇది గత సంవత్సరాంతంతో పోలిస్తే 2 లక్షల ఎకరాలు అధికం. అందులో అత్యధికంగా వరి 6.06 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, తరువాత స్థానంలో మొక్కజొన్న 5.76 లక్షల ఎకరాల్లో సాగైంది. రాష్ట్రవ్యాప్తంగా 25 శాతం మేర ఇప్పటికే సాగు కాగా, సంక్రాంతి నాటికి 60 శాతానికి చేరుకుంటుందని అంచనా. సంక్రాంతి వరకు ప్రభుత్వం రైతుభరోసా నిధులు కూడా జమ చేస్తుండడంతో ఈసారి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా వరి
వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఆసిఫాబాద్, మెదక్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో ఇప్పటివరకు ఎకరం పొలంలో కూడా నాట్లు వేయలేదు. అదే సమయంలో నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 1.67 లక్షల ఎకరాల్లో వరి సాగైనట్లు శాఖ తాజా నివేదిక తేటతెల్లం చేస్తుంది. ఇక్కడ అన్ని రకాల పంటలు కలిపి 2.40 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ఇది మొత్తం పంటల సాగులో 45 శాతం వరకు ఉండటం గమనార్హం. అలాగే నల్లగొండలో 88,372 ఎకరాల్లో సాగైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మహబూబ్నగర్లో 72,553 ఎకరాల్లో వరి సాగవడం విశేషం. కామారెడ్డిలో 47,905 ఎకరాల్లో, రాజన్న సిరిసిల్లలో 46,540, జగిత్యాలలో 35 వేల ఎకరాల్లో వరి సాగైంది. ఈ వారంలో సాగు అన్ని జిల్లాల్లో ఊపందుకుంటుందని అధికారులు చెబుతున్నారు.
పెరిగిన జొన్న, మొక్కజొన్న
మొక్కజొన్న, జొన్న పంటలను మార్క్ఫెడ్ మద్ధతు ధరకు కొంటుండటంతో ఆ పంటల వైపు ఆసక్తి చూపుతున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో యాసంగిలో సంప్రదాయ పంటలుగా పేరొందిన వేరుశనగ, శనగకు ఆదరణ లేకుండా పోయింది. ఈ యాసంగిలో వేరుశనగ సాధారణ సాగు 2.60 లక్షల ఎకరాలుగా పేర్కొంటే, ఇప్పటివరకు 1.43 లక్షల ఎకరాల్లోనే సాగైంది. గత సంవత్సరం చివరి నాటికి సాగైన పంట కన్నా ఇది 60వేల ఎకరాలు తక్కువ. అలాగే శనగ కూడా 50 వేల ఎకరాలు తగ్గింది.
యూరియా కోసం తప్పని పాట్లు
యూరియా పుష్కలంగా ఉందని ప్రభుత్వం ఓవైపు చెబుతుండగా, చాలా జిల్లాల్లో యూరియా కోసం రైతు వేదికలు, పీఏసీఎస్లు, ఎరువుల దుకాణాల వద్ద రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలకు కేటాయించిన యూరియా పంపిణి సక్రమంగా జరిగేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచే నోడల్ అధికారులు రంగంలోకి దిగారు. రైతులు యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా ప్రణాళికలను అమలు చేస్తున్నారు. ఏ రోజుకారోజు అమ్మకాలు, నిల్వలపై నివేదికలు వచ్చేలా వ్యవసాయ సంచాలకుడు డాక్టర్ బి.గోపి ఆదేశాలు ఇచ్చారు.


