పిల్లలు పుట్టలేదు అని భార్యని చంపి తన ఇంట్లోనే.. | Jagityal women incident | Sakshi
Sakshi News home page

పిల్లలు పుట్టలేదు అని భార్యని చంపి తన ఇంట్లోనే..

May 4 2025 8:12 AM | Updated on May 4 2025 10:43 AM

Jagityal women incident

పిల్లలు పుట్టడం లేదని భార్యను చంపిన భర్త

ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నం

కేసును ఛేదించిన పోలీసులు.. ఐదుగురిపై కేసు

జగిత్యాలక్రైం: నిండునూరేళ్లు కలిసి ఉంటామని.. ఏడడుగులు నడిచి ప్రమాణం చేసిన భర్తే కాలయముడై భార్యను హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలకేంద్రంలో జరిగింది. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించగా ఎట్టకేలకు పోలీసులు కేసును ఛేదించారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్‌ వివరాలు వెల్లడించారు.

ఇరవై ఏళ్ల క్రితం వివాహం
కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్‌కు చెందిన మమతను (35) ఇరవై ఏళ్ల క్రితం జగి త్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన అవుదుర్తి మహేందర్‌కు ఇచ్చి వివాహం చేశా రు. వివాహ సమయంలో కట్నకానుకలు ముట్టజెప్పారు. కానీ, ఆర్థిక సమస్యలు తలెత్తడంతో కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. మహేందర్‌ మద్యానికి బానిసై అప్పులు చేశాడు. రోజూ తాగి వచ్చి మమతను వివాహ సమయంలో కట్నం తక్కువగా ఇచ్చారని, పిల్లలు పుట్టడం లేదని తీవ్రంగా వేధించాడు. అతడితోపాటు తల్లి వజ్రవ్వ, తండ్రి లక్ష్మణ్‌, తమ్ముళ్లు అ నిల్‌, వెంకటేశ్‌ కూడా వేధింపులకు గురిచేసేవారు. మహేందర్‌ ఏ పని చేయకపోవడంతో మమత కరీంనగర్‌లోని ఓషాపింగ్‌మాల్‌లో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.

ఇరవై రోజుల క్రితం పంచాయితీ
తరుచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో 20 రోజుల క్రితం మల్లాపూర్‌లో పంచాయితీ నిర్వహించారు. దీంతో మమతను బాగా చూసుకుంటానని మహేందర్‌ కరీంనగర్‌లోని అద్దె ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం పుస్తెలతాడు ఇవ్వాలని మమతను కోరగా నిరాకరించింది. ఈనేపథ్యంలో మహేందర్‌ గతనెల 26న నల్లగొండ, వేములవాడ దైవ దర్శనానికని నమ్మించి, దైవ దర్శనం అనంతరం కొడిమ్యాలకు తీసుకెళ్లాడు. 

అదేరోజు నైలాన్‌ తాడును ఆమె మెడ చుట్టూ బిగించి హత్య చేశాడు. ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించేందుకు ఆమె మెడకు నైలాన్‌తాడు చుట్టి ఇంటి స్లాబ్‌కు కట్టాడు. పుస్తెలతాడు తీసుకొని గంగాధరలోని ఓ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి డబ్బు తీసుకుని అప్పులు తీర్చాడు. ఈక్రమంలో పోలీసులు లోతుగా విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. శనివారం నిందితుడు మోటారుసైకిల్‌పై పారిపోతుండగా చెప్యాల ఎక్స్‌రోడ్‌ వద్ద అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడితో పాటు అతడి తల్లిదండ్రులు, తమ్ములపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో మల్యాల సీఐ రవి, కొడిమ్యాల ఎస్సై సందీప్‌ పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement