హైదరాబాద్ నుంచి గోవా టూర్.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

IRCTC Tourism Offers 3 Day Tour To Goa From ₹ 15,780 Per Person  - Sakshi

కోవిడ్‌తో మారిన టూర్‌ ట్రెండ్‌

సిటీ నుంచి కాశ్మీర్, లద్దాక్, లేహ్, గుజరాత్‌లకు ఎక్కువ డిమాండ్‌ 

ట్రైన్‌ టూర్‌ల కంటే ఎయిర్‌ ప్యాకేజీలకే ఆదరణ 

 ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ టూర్స్‌  

పర్యాటకం పంథా మారింది. ఎక్కడికైనా సరే రెక్కలు కట్టుకొని ఎగిరిపోయేందుకు పర్యాటక ప్రియులు ఆసక్తి చూపుతున్నారు. కోవిడ్‌ నేపథ్యంలో పర్యాటకుల అభిరుచి మారింది. గంటలు, రోజుల తరబడి బస్సులు, రైళ్లలో ప్రయాణం చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకొని ఎక్కువ ప్రాంతాలను సందర్శించే విధంగా  ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. గోవా, కాశ్మీర్, హంపీ తదితర ప్రాంతాలతో పాటు కొత్తగా లద్దాక్, లేహ్, డార్జిలింగ్‌ వంటి ఇతర ప్రాంతాలపైనా ఆసక్తి చూపుతున్నారు. ఇందుకనుగుణంగానే ఐఆర్‌సీటీసీ ఎయిర్‌ప్యాకేజీలను అందజేస్తోంది.  

సాక్షి, హైదరాబాద్‌: పర్యాటక ప్రియులు ఇప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలను సందర్శించేందుకు ప్రాముఖ్యతనిస్తున్నారు. దాదాపు ఏడాదిన్నరగా కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన వారు సమయాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ఆలోచిస్తున్నారు. ఇందుకు విమాన ప్రయాణానికే ఓటేస్తున్నారు. కోవిడ్‌ సెకెండ్‌ వేవ్‌ అనంతరం గత 2 నెలల్లో సుమారు 20 ఎయిర్‌ ప్యాకేజీలను నిర్వహించినట్లు ఐఆర్‌సీటీసీ గ్రూప్‌ జనరల్‌ మేనేజర్‌ నర్సింగ్‌రావు తెలిపారు. కోవిడ్‌  మొదటి ఉధృతి అనంతరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 38 ఎయిర్‌ ప్యాకేజీలను ఏర్పాటు చేశారు. 2019లో హైదరాబాద్‌  నుంచి ఐఆర్‌సీటీసీ ఏకంగా 175 ఎయిర్‌ ప్యాకేజీలను ఏర్పాటు చేసింది. వేలాది మంది పర్యాటకులు దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. అదే సమయంలో రైల్‌ టూర్‌లు, ఉత్తర, దక్షిణాది పర్యాటక రైళ్లను సైతం  అందుబాటులోకి తెచ్చారు. 

ఇవిగో ఎయిర్‌ప్యాకేజీలు... 
గోవా టూర్‌ సెప్టెంబర్‌ 24న ప్రారంభంకానుంది. విమాన ప్రయాణంతో పాటు రోడ్డు, రవాణా, గోవాలో హోటల్‌ సదుపాయం, తదితర అన్ని ఏర్పాట్లు ఐఆర్‌సీటీసీ అందజేస్తుంది. ఈ పర్యటనలో ఉత్తర, దక్షిణ గోవాలను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీ (మూడు రాత్రులు..నాలుగు పగళ్లు)ఒక్కరికి ర.15,780 చొప్పున ఉంటుంది.  

 స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ పర్యటన ప్యాకేజీ(ఐదు రాత్రులు, ఆరు పగళ్లు) విలువ ర.23,150. అక్టోబర్‌ 1వ తేదీన ఈ పర్యటన మొదలవుతుంది. అహ్మదాబాద్, ద్వారక, సోమ్‌నాథ్‌ ఆలయాలతో పాటు సర్ధార్‌ వల్లభ్‌బాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని సందర్శించవచ్చు. 

 హౌస్‌బోట్‌ సదుపాయంతో కూడిన కశ్మీర్‌ పర్యటన సెప్టెంబర్‌ 16న  ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో( ఐదు రాత్రులు, ఆరు పగళ్లు) శ్రీనగర్, గుల్మార్గ్, పహల్‌గావ్, సోన్మార్గ్‌ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఈ ప్యాకేజీ  రూ.24.480 చొప్పున ఉంటుంది.  

 రాయల్‌ రాజస్థాన్‌ యాత్ర (ఐదు రాత్రులు, ఆరు పగళ్లు) సెప్టెంబర్‌ 2న ప్రారంభం కానుంది. జైపూర్, జోథ్‌పూర్, పుష్కర్, ఉదయ్‌పూర్‌ తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. ర.23,900 చొప్పున ఈ పర్యటన ప్యాకేజీ ఉంటుంది. 
 
ఉత్తరభారత యాత్ర... 
     ట్రైన్‌లో వెళ్లే పర్యాటకుల కోసం ఉత్తర భారత యాత్ర, వారణాసి–గయ–ప్రయాగ్‌రాజ్, దక్షిణభారత యాత్ర రైళ్లను సిద్ధం చేసింది. ఉత్తర భారత యాత్ర, ఈ నెల 27 నుంచి సెప్టెంబర్‌ 6 వరకు కొనసాగుతుంది. ఆగ్రా, మధుర, వైష్ణోదేవి ఆలయం, అమృత్‌సర్, హరిద్వార్, దిల్లీ తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. ఒక్కొక్కరికి అన్ని సదుపాయాలతో ర.10,400 చొప్పున ఉంటుంది.  

    దక్షిణభారత యాత్ర అక్టోబర్‌ 19న ప్రారంభమై 25వ తేదీ వరకు కొనసాగుతుంది. తిరుచురాపల్లి, తంజావూరు,రామేశ్వరం, మధురై, కన్యాకువరి, మహాబలిపురం, కాంచీపురం తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ ప్యాకేజీ రూ.6,620 చొప్పున ఉంటుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top