కోల్‌ గ్యాసిఫికేషన్‌తో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు | Investments of Rs 3 lakh crore with coal gasification | Sakshi
Sakshi News home page

కోల్‌ గ్యాసిఫికేషన్‌తో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు

Jun 12 2026 3:54 AM | Updated on Jun 12 2026 3:54 AM

Investments of Rs 3 lakh crore with coal gasification

వేలాది ప్రత్యక్ష, పరోక్షఉద్యోగ, ఉపాధి అవకాశాలు... 

కోల్‌ గ్యాసిఫికేషన్‌ ప్రయాణానికిహైదరాబాద్‌ ఒక మూలాధారం  

రోడ్‌షో టు ప్రమోట్‌ సర్ఫేస్‌ కోల్‌/ లిగ్నేట్‌ గ్యాసిఫికేషన్‌’లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : కోల్‌ గ్యాసిఫికేషన్‌ ద్వారా ఉత్పత్తి అయ్యే మిథనాల్, అమ్మోనియా, హైడ్రోజన్, ఇతర ఉత్పత్తులకు ఫార్మా రాజధాని హైదరాబాద్‌ అద్భుతమైన మార్కెట్‌ అని కేంద్ర బొగ్గు,గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ‘ఇటీవల ఆమోదం పొందిన రూ.37,500 కోట్ల కోల్‌ గ్యాసిఫికేషన్‌ స్కీం, కోల్‌ గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టులు మరింత వేగంగా ముందుకు సాగుతాయి. దేశవ్యాప్తంగా మెగా గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టుల స్థాపనలో ఈ స్కీం కీలకపాత్ర పోషిస్తుంది. ఈ పథకం ద్వారా సుమారు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి’అని వెల్లడించారు. 

‘ప్రతి ఏడాది రూ.3 లక్షల కోట్లు విదేశీ మారకద్రవ్యాన్ని దిగుమతుల కోసం వినియోగిస్తున్నాం. కోల్‌ గ్యాసిఫికేషన్‌ ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవచ్చు. ఫెర్టిలైజర్, స్టీల్, ఎనర్జీ వంటి రంగాల్లో కోల్‌ గ్యాసిఫికేషన్‌ ప్రముఖపాత్ర పోషిస్తుంది’అని చెప్పారు. హైదరాబాద్‌లోని మన శాస్త్రవేత్తలు ఇక్కడ లభ్యమయ్యే బొగ్గును గ్యాసిఫికేషన్‌ చేసే సాంకేతికతను అభివృద్ధి చేశారన్నారు. ఇక్కడి బీహెచ్‌ఈఎల్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీతోపాటు అనేక పరిశోధన సంస్థలు ఇందులో భాగస్వామ్యం అయ్యాయని చెప్పారు. తెలంగాణలో సింగరేణి వద్ద అపారమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని గుర్తు చేశారు. గురువారం హెచ్‌ఐసీసీలో చేపట్టిన ‘రోడ్‌షో టు ప్రమోట్‌ సర్ఫేస్‌ కోల్‌/ లిగ్నేట్‌ గ్యాసిఫికేషన్‌’లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ‘హైదరాబాద్‌లో రెండో కోల్‌ గ్యాసిఫికేషన్‌ రోడ్‌ షో నిర్వహించడం ఆనందంగా ఉంది. గత నెల 28న ఢిల్లీలో నిర్వహించిన తొలి రోడ్‌షోకు పరిశ్రమలు, సాంకేతిక సంస్థలు, ఆర్థిక సంస్థలు, పరిశోధకులు, ప్రాజెక్టు అభివృద్ధి సంస్థల నుంచి విశేష స్పందన లభించింది. హైదరాబాద్‌ రోడ్‌ షో కోల్‌ గ్యాసిఫికేషన్‌ ప్రయాణానికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. కోల్‌ గ్యాసిఫికేషన్‌ ప్రయాణానికి హైదరాబాద్‌ ఒక మూలాధారం అని చెప్పొచ్చు. 

ఒకప్పుడు మన దేశంలోని బూడిద శాతం ఎక్కువగా ఉన్న బొగ్గుతో గ్యాసిఫికేషన్‌ సాధ్యం కాదనే అభిప్రాయం ఉండేది. అయితే మన సైంటిస్ట్‌లు ఈ బొగ్గును గ్యాసిఫికేషన్‌ చేసే సాంకేతికతను అభివృద్ధి చేశారు’అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనులు శాఖ సహాయ మంత్రి సతీశ్‌చంద్ర దూబే, సింగరేణి కాలరీస్‌ సీఎండీ జ్యోతి బుద్ధప్రకాశ్, పరిశ్రమ ప్రతినిధులు, పెట్టుబడిదారులు, ఇతర స్టేక్‌ హోల్డర్లు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement