
తోబుట్టువుల ఆస్తి వివాదాల కేసులో జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: నిత్యం పెరిగిపోతున్న తోబుట్టువుల ఆస్తి తగాదాలు, వివాహ వివాదాలపై ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉన్నత చదువులు చదువుకుని.. మంచి ఉద్యోగం చేస్తూ.. ఆర్థికంగా బాగానే ఉన్నా.. స్వల్ప ఆస్తి కోసం కొందరు సోదరులు, సోదరీమణులతో కొట్లాడుతుంటారన్నారు. ఒకరిపై ఒకరు కేసులు, పిటిషన్లు వేసుకుంటూ న్యాయస్థానాలను పెద్ద ఎత్తున ఆశ్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సూర్యాపేటలోని అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని గతంలో ఈ కోర్టు ఇచ్చిన ఆదేశాలను మునిసిపల్ అధికారులు అమలు చేయడం లేదంటూ హైదరాబాద్ నివాసి చార్టర్డ్ అకౌంటెంట్ రాహుల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కూల్చిన తర్వాత స్థలాన్ని సమానంగా పంచేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్పై జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి విచారణ చేపట్టారు.
2024, ఫిబ్రవరిలో జారీ చేసిన స్పీకింగ్ ఆర్డర్ ప్రకారం చర్యలు చేపట్టి.. స్టేటస్ రిపోర్టును తమకు తెలియజేయాలని సూర్యాపేట మునిసిపాలిటీని ఆదేశించారు. తదుపరి విచారణ జూలై 28కి వాయిదా వేశారు. కేసు విచారణ సందర్భంగా పిటిషన్ వేసిన వ్యక్తి ఆ భవనంలో ఉంటున్న వారికి సోదరుడు అని.. నలుగురి మధ్య ఆస్తి వివాదం ఉందని తెలుసుకుని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య ఇలాంటి పిటిషన్లు న్యాయస్థానాల్లో పెరిగిపోతున్నాయని, కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అహంకారంతోనే కేసులు..: ‘హైకోర్టుకు అధికారం ఉండి ఉంటే ఆస్తి తగదాలు, వివాహ వివాదాల్లో ఆస్తులన్నింటినీ న్యాయస్థానం కస్టడీలోకి తీసుకునేవాళ్లం. అప్పుడు అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఆస్తి కోసం కొట్లాటలు పెట్టుకుని ఏం సాధిస్తారు? కోర్టు చుట్టూ తిరిగి చివరికి ఆ ఆస్తి పొందిన వాళ్లు కూడా సంతోషంగా ఉండలేరు. ఇక్కడ 264 గజాలు ఆరుగురు (తల్లిదండ్రులతో కలిపి) పంచుకోవాలి. దాదాపు 44 గజాల స్థలం కోసం కొట్లాడుతున్నారు. అందులో ఇళ్లు కట్టుకునేందుకు అధికారులు అనుమతి కూడా ఇవ్వరు. దాంతో ధనవంతులూ కాలేరు. చివరకు ఏం సాధించినట్లు.. అతి పెద్ద సమస్య ఏంటంటే అహంకారం.
కంపెనీ లా ట్రిబ్యునల్లో దివాలా పరిష్కార నిపుణుడిని పెట్టినట్లు ఇక్కడ కూడా అలాంటి వ్యక్తిని ఏర్పాటుచేసి ఆస్తులను కస్టడీలోకి తీసుకుని.. పార్టి షన్ సూట్లో ఆస్తుల పరిష్కార ప్రక్రియ చేపడితే సరిపోతుంది. అసలు.. తల్లిదండ్రులు బతికి ఉన్నంత వరకు కుమారుడు, కుమార్తె ఆస్తుల్లో వాటాను కోరకుండా చర్యలు తీసుకుంటే తెలిసొస్తుంది. ఉన్నత చదువులు చదువుకుంటారు.. మంచి ఉద్యో గం చేస్తుంటారు.. ఆర్థికంగా బాగానే ఉంటారు.. అయినా స్వల్ప ఆస్తి కోసం కూడా కొట్లాడుతుంటారు. కుటుంబ సభ్యులతో కొట్లాడి వెయ్యి గజాలు సాధించుకున్నా అది భవిష్యత్లో సంతృప్తినివ్వదు. అహంకారం వీడితే సమస్యలకు కుటుంబ స్థాయిలోనే పరిష్కారం దొరుకుతుంది’అని పేర్కొన్నారు.