లోన్‌ యాప్స్‌ కేసుల్లో మరో ట్విస్ట్.. ఐసీఐసీఐ అధికారి అరెస్టు

ICICI Bank Manager Accused of Fraud Arrested From West Bengal - Sakshi

లోన్‌ యాప్స్‌ కేసుల్లో సిటీ పోలీసులు ఫ్రీజ్‌ చేసిన ఆరు బ్యాంకు ఖాతాలను డీ-ఫ్రీజ్‌ చేసి రూ.1,18,70,779 మళ్లించిన కేసులో కోల్‌కతాలోని అలీపోరే ఐసీఐసీఐ బ్యాంకు శాఖ మేనేజర్‌ రాకేష్‌ కుమార్‌ దాస్‌ను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. సైబర్‌ నేరగాళ్లతో మిలాఖత్‌ అయిన ఇతగాడు ఆరు ఖాతాలను డీ-ఫ్రీజ్‌ చేయడంతో పాటు చేయించినట్లు అధికారులు తేల్చారు.

ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న అనిల్‌కుమార్, ఆనంద్‌ జున్నుల విచారణలో దీనికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. ఈ ఏడాది జూన్‌ నుంచి పరారీలో ఉన్న రాకేష్‌ను కోల్‌కతాలో అరెస్టు చేసి, సోమవారం నగరానికి తీసుకువచ్చారు. ఇతడిని కస్టడీలోకి తీసుకుని విచారించడం ద్వారా పరారీలో ఉన్న సూత్రధారి ఉత్తమ్‌ చౌదరి ఆచూకీ కనిపెట్టాలని భావిస్తున్నారు.(చదవండి: Digital Loan: రంగంలోకి టెక్‌ కంపెనీలు)

  • అక్రమ మైక్రో ఫైనాన్సింగ్‌ వ్యవహారాలకు పాల్పడిన లోన్‌ యాప్స్‌ కేసుల్లో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఫ్రీజ్‌ చేయించిన ఖాతాల్లో ఢిల్లీలోని హైంజ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌కు ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి చెందినవి ఉన్నాయి.
  • దీని ఖాతా ఢిల్లీలోని ఉద్యోగ్‌ విహార్‌లో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచ్‌లో ఉంది. దీంతో పాటు మరో అయిదు కంపెనీలకు చెందిన ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్‌ల్లోని ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలను డీ-ఫ్రీజ్‌ చేయించడానికి నేరగాళ్లు పథకం వేశారు. 
  • దీనికోసం అప్పట్లో కోల్‌కతాలో నివసిస్తున్న బీహార్‌కు చెందిన ఉత్తమ్‌ చౌదరిని రంగంలోకి దింపారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఫ్రీజ్‌ చేయించిన 45 బ్యాంకు ఖాతాలను డీ- ఫ్రీజ్‌ చేయించాలని ఇతడితో చెప్పారు.  
  • రంగంలోకి దిగిన ఉత్తమ్‌ వీటిని డీ-ఫ్రీజ్‌ చేయాలంటూ హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల పేరుతో నకిలీ పత్రాలు తీసుకుని కోల్‌కతాలోని అలీపోరేలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్‌నకు వెళ్లాడు.  
  • దాని మేనేజర్‌ రాకేష్‌ను కలిసిన ఉత్తమ్‌... తన పథకం మొత్తం వివరించాడు. బ్యాంక్‌ మేనేజర్‌ సూచనల మేరకే అక్కడి లాల్‌బజార్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణా ఎస్సైగా నకిలీ పత్రాలు సైతం సృష్టించుకు వచ్చాడు. వీరిద్దరూ కలిసి పథకం పన్నారు.
  • ఆ బ్రాంచ్‌లో ఉన్న రెండు ఖాతాలతో పాటు ఢిల్లీ, గుర్గావ్, హరియాణాల్లోని ఐసీఐసీఐ బ్యాంకుల్లోని నాలుగింటిని డీ-ఫ్రీజ్‌ చేయించారు. 45 ఖాతాలను డీ–ఫ్రీజ్‌ చేయాలంటూ హైదరాబాద్‌లోని ఐసీఐసీఐ బ్యాంకు రీజినల్‌ కార్యాలయానికీ లేఖ రాశారు.   
  • ఢిల్లీతో పాటు చట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వివిధ బ్రాంచ్‌ల్లోని మరో నాలుగు ఖాతాలను డీ-ఫ్రీజ్‌ చేయించాడు.  
  • రాకేష్‌ మరో అడుగు ముందుకు వేశాడు. డీ-ఫ్రీజ్‌ చేసిన ఖాతాల్లోని నగదును ఉత్తమ్‌ సూచించినట్లు అనిల్, ఆనంద్‌లకు చెందిన చెందిన ఎస్బీఐ ఖాతాలోకి మళ్లించేలా చేశాడు. రాకేష్‌ నగదు బదిలీలు సైతం చేయించేశాడు. 
  • తనపై అనుమానం రాకుండా హైదరాబాద్‌లోని రీజినల్‌ కార్యాలయానికి సమాచారం ఇచ్చాడు. అప్పటికే ఈ కార్యాలయానికి కూడా కొన్ని ఖాతాలు డీ-ఫ్రీజ్‌ చేయమంటూ లేఖలు అందడంతో సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అనుమానించి కేసు నమోదు చేశారు. ఈ స్కామ్‌లో రాకేష్‌ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు జ్యుడీషీయల్‌ రిమాండ్‌కు తరలించారు.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top