Sambasiva Rao: సాంబశివరావుపై చీటింగ్‌ కేసు నమోదు | Hyderabad: Case Filed Against TV5 Sambasiva Rao - Sakshi
Sakshi News home page

అమ్మ సాంబా..! మొత్తానికి చీటింగ్‌ కేసు నమోదు

Feb 1 2024 3:04 PM | Updated on Feb 1 2024 3:26 PM

Hyderabad: Case Filed Against TV5 Sambasiva Rao - Sakshi

టీవీ5 వేదికపై సుద్దపూస ముచ్చట్లు చెప్పే సాంబశివరావుపై చీటింగ్‌ కేసు నమోదు అయ్యింది. 

హైదరాబాద్‌, సాక్షి: నిత్యం టీవీ5 వేదికగా తాను వల్లించేవి రాజకీయ ప్రవచనాలుగా ఫీలయ్యే సాంబశివరావు పైన కేసు నమోదైంది. భూ వ్యవహారంలో తమను మోసం చేసారంటూ హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో FIR నమోదు చేసారు. మీడియా వృత్తితో పాటు సాంబశివరావు పెట్రోల్ బంకుల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ పెట్రోల్ బంకు నిర్వహణకు స్థలం లీజుకు ఇచ్చిన వ్యవహారంలో ఆయనపై, ఆయన కుటుంబ సభ్యులపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. హిందూస్థాన్ పెట్రోలియంకు తాము సంతకాలు చేయకుండానే తమ సంతకాలతో లీజు డాక్యుమెంట్లు సృష్టించారన్నది ప్రధాన అభియోగం.

పచ్చమీడియాలో భాగమైన టీవీ5 ద్వారా తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సాంబశివరావుపై ఈ కేసులో ప్రధాన అభియోగాలు నమోదయ్యాయి. సాంబశివరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తమను మోసం చేసారంటూ బాధితులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. శేరిలింగంపల్లి ప్రాంతంలో 600 చదరపు మీటర్ల స్థలం విషయంలో ఈ వివాదం నెలకొంది. పెట్రోల్ బంక్ కోసం ఈ స్థలం కూడా కలిపి సాంబ కుటుంబ సభ్యులు హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ తో లీజ్ కు ఇచ్చినట్లుగా ఒప్పందం చేసుకున్నారని బాధితుల ఆరోపణ.

దీని పైన తాము సాంబశివరావును, ఆయన కుటుంబ సభ్యులను ప్రశ్నించగా అక్కడ ఉన్న పెట్రోల్ బంక్ ను వారి పేరు మీదికే బదిలీ చేస్తామని నమ్మించారని చెబుతున్నారు. ఎంత కాలం అయినా చెప్పిన విధంగా చేయకపోవటంతో అనుమానం వచ్చిన ఫిర్యాదు దారులు హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ అధికారులను కలిశారు. అక్కడ తమకు ప్రమేయం లేకుండానే తాము HPCLకు తమ స్థలం లీజుకు ఇచ్చినట్లుగా సంతకాలు చేసినట్లు.. ఈ డాక్యుమెంట్లు అన్నీ దురుద్దేశపూర్వకంగా రూపొందించినట్టు గుర్తించారు. కంపెనీ ప్రతినిధులకు బాధితులు అసలు విషయాన్ని మొర పెట్టుకున్నారు.

దీంతో కంగారు పడ్డ కంపెనీ అధికారులు.. మూడేళ్లుగా లీజు ఎరియర్స్ చెల్లించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. కానీ, స్థలం విషయంలో సాంబశివరావు, కుటుంబ సభ్యులు చేసిన మోసానికి ఏం చేయలేమని చేతులెత్తేయడంతో బాధితులు మాదాపూర్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసారు. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కింద చూడవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement