జస్టిస్‌ రామలింగేశ్వర్‌రావు కన్నుమూత | Hyd Hc Ex judge Ramalingeswara Rao Passes Away | Sakshi
Sakshi News home page

జస్టిస్‌ రామలింగేశ్వర్‌రావు కన్నుమూత

Apr 6 2024 5:54 AM | Updated on Apr 6 2024 5:54 AM

Hyd Hc Ex judge Ramalingeswara Rao Passes Away - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జస్టిస్‌ ఎ.రామలింగేశ్వర్‌రావు గుండె పోటు తో కన్ను మూశారు. జర్మనీలో ఉన్న కూతురును చూడడానికి వెళ్లగా శుక్రవారం ఉదయం ఒక్కసారిగా రామలింగేశ్వర్‌రావుకు ఛాతీలో నొప్పి వచ్చింది. వెంటనే ఆస్ప త్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 1956, మే 21న ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఆయన జన్మించారు. ఉస్మానియా నుంచి ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేసిన ఆయన 1982లో న్యాయవాదిగా నమోదు చేసుకు న్నారు. 1984లో జస్టిస్‌ ఏ.వెంకట్రామిరెడ్డి వద్ద జూనియర్‌గా చేరి 1987లో స్వతంత్ర న్యాయ వాదిగా ప్రాక్టీస్‌ ప్రారంభించారు. న్యాయవాదిగా కొనసాగుతూనే ఉస్మానియాలో పార్ట్‌టైమ్‌ లెక్చరర్‌గా పీజీ విద్యార్థులకు ఇంటర్నేషనల్‌ లా పాఠాలు చెప్పారు.

2013లో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే వరకు సామాజిక న్యాయం, పర్యావరణంతోపాటు పలు విభాగాల్లో సమర్థవంతమైన న్యాయవాదిగా వాదనలు వినిపించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని అడవుల రక్షణకు వాదించిన కేసు దేశమంతటా ‘సమత’ కేసుగా ప్రసిద్ధి చెందింది. ప్రభుత్వ న్యాయవాదిగా, టీటీడీ, ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ తదితరాలకు న్యాయవాదిగా పనిచేశారు. సాహిత్యం, కళలపై ఆయనకు మక్కువ ఎక్కువ. విపరీతంగా పుస్తకాలు చదవడంతో పాటు రాయడం అలవాటు. న్యాయమూర్తిగా దాదాపు 13 వేల తీర్పులు ఇచ్చారు. వీటిలో 100కు పైగా లా జర్నల్‌లో ప్రచురితం కావడం విశేషం. 2018లో న్యాయమూర్తిగా పదవీ విరమణ పొందారు. అనంతరం ఏపీ ప్రభుత్వం ఆయన్ను స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ చైర్మన్‌గా నియమించింది. 

Advertisement
 
Advertisement
Advertisement