ముంబై: దావూదీ బోహ్రా వారసత్వ వివాదంలో సంచలన తీర్పునిచ్చిన బొంబాయి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ గౌతమ్ ఎస్. పటేల్ కుటుంబాన్ని ప్రాణభయం వెంటాడుతోంది. ఆ తీర్పు వెలువడినప్పటి నుంచి అంటే గత 10 నెలలుగా భారత్, బ్రిటన్ దేశాలలో ఉంటున్న ఈ కుటుంబానికి వరుస బెదిరింపులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే లండన్లో ఉంటున్న జడ్జి కుమార్తెపై ముసుగు ధరించిన దుండగుడు భౌతిక దాడికి తెగబడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ పరిణామాలతో అప్రమత్తమైన అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు విచారణను వేగవంతం చేశాయి.
ముసుగు ధరించిన దుండగుడి దాడి
రిటైర్డ్ జడ్జి జస్టిస్ గౌతమ్ పటేల్ కుమార్తె అదితి పటేల్ లక్ష్యంగా లండన్లో గత ఏప్రిల్లో ఒక ఘాతుకం చోటుచేసుకుంది. ముసుగు ధరించిన ఒక గుర్తుతెలియని వ్యక్తి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో అదితి పటేల్ ముక్కు ఎముక విరిగింది. ప్రస్తుతం బ్రిటిష్ పోలీసులు, కౌంటర్ టెర్రరిజం విభాగానికి చెందిన అధికారులు ఈ దాడి ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. కుటుంబానికి వస్తున్న అంతర్జాతీయ బెదిరింపులతో ఈ దాడికి ఏమైనా లింక్ ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
బెదిరింపు లేఖ.. రహస్య ఎస్డీ కార్డ్
ఈ దాడి ఘటన మరువక ముందే, జూన్ 5న అదితి పటేల్కు మరో అనామక బెదిరింపు లేఖ అందింది. మీ కుటుంబాన్ని అంతమొందించడానికి కాంట్రాక్ట్ ఇచ్చారంటూ ఆ లేఖలో హెచ్చరించడం సంచలనంగా మారింది. ఆ లేఖతో పాటు ఒక ఎస్డీ కార్డ్ను కూడా దుండగులు పంపారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆ ఎస్డీ కార్డ్లో ఏముందో చూడకుండానే, న్యాయమూర్తి కుటుంబ సభ్యులు దానిని నేరుగా పోలీసులకు అప్పగించారు. గత ఏడాది సెప్టెంబర్ (2025)లో ముంబైలో జస్టిస్ పటేల్కు కూడా ఇలాంటి బెదిరింపు లేఖే వచ్చింది.
దావూదీ బోహ్రా వారసత్వ వివాదం ఏమిటి?
ఈ వివాదమంతా ఏప్రిల్ 23, 2024న జస్టిస్ గౌతమ్ పటేల్ ఇచ్చిన తీర్పు చుట్టూ తిరుగుతోంది. దావూదీ బోహ్రా ముస్లిం సమాజానికి చెందిన 53వ ఆధ్యాత్మిక గురువు (దాయ్ అల్-ముత్లక్) వారసత్వ పోరుపై ఆయన తుది తీర్పు ఇచ్చారు. ఈ వివాదంలో ముఫద్దల్ సైఫుద్దీన్ను చట్టబద్ధమైన ఆధ్యాత్మిక అధిపతిగా కోర్టు గుర్తించింది. ఆయన స్థానాన్ని సవాలు చేస్తూ తాహెర్ ఫకృద్దీన్ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రస్తుతం ఈ సింగిల్ జడ్జి తీర్పును బొంబాయి హైకోర్టు డివిజన్ బెంచ్లో సవాలు చేయగా, విచారణ పెండింగ్లో ఉంది.


