నిత్యం షూటింగ్స్తో బిజీ బిజీగా ఉండే సినీ సెలబ్రిటీలు ఏమాత్రం విరామం దొరికినా కుటుంబంతో వెకేషన్ని ప్లాన్ చేస్తుంటారు. ఈ కోవలోనే ప్రస్తుతం హీరో అల్లు అర్జున్ కూడా ఫ్యామిలీతో కలిసి వెకేషన్లో ఉన్నారు. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాకా’. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.
‘పుష్ప: ది రైజ్, పుష్ప 2: ది రూల్’ వంటి బ్లాక్బస్టర్ మూవీస్ తర్వాత అల్లు అర్జున్ హీరోగా, ‘జవాన్’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత అట్లీ తెరకెక్కిస్తున్న ‘రాకా’పై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ కోసం ముంబైలోనే ఉంటూ షూటింగ్లో పాల్గొంటున్న అల్లు అర్జున్ ఈ బిజీ షెడ్యూల్ నుంచి చిన్న విరామం తీసుకున్నారు. అనంతరం తన భార్య అల్లు స్నేహ, కుమారుడు అయాన్, కుమార్తె అర్హాతో కలిసి ఆస్ట్రియా వెకేషన్కి వెళ్లారు అల్లు అర్జున్.
నార్డ్కెట్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి సుమారు 1,905 మీటర్ల ఎత్తులో ఉన్న సీగ్రూబ్ టెర్రెస్ హిల్ స్టేషన్లో ఫ్యామిలీతో కలిసి చిల్ అవుతున్నారు. ఈ వెకేషన్కి సంబంధించిన ఫొటోలు, వీడియోలను స్నేహ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేయగా, వైరల్గా అయ్యాయి. ఆస్ట్రియా వెకేషన్ ముగించుకుని త్వరలో హైదరాబాద్ రానున్న అల్లు అర్జున్ వెంటనే ముంబైలో ‘రాకా’ కొత్త షెడ్యూల్తో బిజీ అవుతారు.


