‘ప్రైవేట్‌’కు ఇచ్చే అధికారం కలెక్టర్‌కు లేదు | High Court comments on the Kondakal land dispute | Sakshi
Sakshi News home page

‘ప్రైవేట్‌’కు ఇచ్చే అధికారం కలెక్టర్‌కు లేదు

Apr 27 2025 5:10 AM | Updated on Apr 27 2025 5:10 AM

High Court comments on the Kondakal land dispute

వివాదాన్ని తేల్చే అధికారం సివిల్‌ కోర్టుదే..

కొండకల్‌ భూ వివాదంలో హైకోర్టు వ్యాఖ్యలు  

సాక్షి, హైదరాబాద్‌: భూముల వర్గీకరణ, రెవెన్యూ రికార్డుల్లో ఎంట్రీలకు సంబంధించిన వివాదాల్లో జోక్యం చేసుకుని, ఉత్తర్వులు జారీ చేసే అధికారం కలెక్టర్‌కు ఉండదని హైకోర్టు తేల్చిచెప్పింది. సివిల్‌ కోర్టులకు మాత్రమే అలాంటి అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మారుస్తూ కలెక్టర్‌ కొత్తగా సర్వే నంబర్‌ కేటాయించడం చట్టవిరుద్ధమని చెప్పింది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం కొండకల్, మోకిల గ్రామాల మధ్య ఉన్న 40.12 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అని తేల్చుతూ సర్వే శాఖ, తహసీల్దార్‌ 2014లోనే ఉత్తర్వులు జారీ చేసినా, జిల్లా కలెక్టర్‌ దాన్ని ప్రైవేటు వ్యక్తుల పేర్లపై రికార్డుల్లోకి చేర్చుతూ ప్రొసీడింగ్స్‌ ఇవ్వడాన్ని తప్పుబట్టింది.

వెంటనే ఆ ఉత్తర్వులను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్‌ సర్వే నంబర్‌ 398/ఏ, 400/ఏ, 402/ఏ, 402/ఏ1/1 లోని 2.14 ఎకరాల భూమిని 2008లో చట్టబద్ధంగా కొనుగోలు చేశామని, తన పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కృష్ణరామ్‌ భూపాల్‌ అనే వ్యక్తి కబ్జా చేసి తమకు దారి ఇవ్వడం లేదంటూ జూబ్లీహిల్స్‌కు చెందిన శైలజ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆక్రమించిన 20.12 ఎకరాల ప్రభుత్వ భూమి ‘బిలా దాఖలా’(ఎవరికీ చెందనిది, ఏ సర్వే నంబర్‌లో లేనిది) కేటగిరీ కిందకు వస్తుందన్నారు. 

ఈ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ 2022, 2023లో కలెక్టర్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను కొట్టివేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ భూ వివాదంపై 2014లో పిటిషన్‌ వేశామన్నారు. అప్పుడు సర్వే చేసిన అధికారులు 40.12 ఎకరాలు బిలాదాఖలా భూమిగా (ప్రభుత్వ భూమిగా) తేల్చారన్నారు. అందులో 20.12 ఎకరాలు ఆక్రమణల్లో ఉందని తహసీల్దార్‌ కౌంటర్‌ కూడా వేశారని చెప్పారు. ఇదిలా ఉండగా, ఆ భూమిని పట్టా భూమిగా పేర్కొంటూ విలేజ్‌ మ్యాప్‌ను మార్చాలని 2022లో కలెక్టర్‌ సర్వే శాఖకు ప్రొసీడింగ్స్‌ ఇచ్చారని నివేదించారు. 

2023లో కొత్త సర్వే నంబర్లతో ప్రైవేటు వ్యక్తుల పేర్లను రికార్డుల్లో చేర్చారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. సదరు భూములపై ఎలాంటి లావాదేవీలు నిర్వహించడం, భూమిని ఇతరుల పేరు మీదకు మార్చడం చేయొద్దని పిటిషనర్‌ను ఆదేశించారు. తదుపరి విచారణను జూన్‌ 21కు వాయిదా వేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement