సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
ప్రస్తుతం రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా కదులుతున్నాయని.. నాలుగైదు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ, రేపు, ఎల్లుండి(ఆది,సోమ, మంగళ) పలు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది.
ఏపీలో ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..
ఏపీలో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. చెట్ల క్రింద, విద్యుత్ స్తంబాలు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.


