
జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం
9 వారాలు ప్రత్యేక పూజలు
ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు
కోట మెట్లకు బొట్లు పెట్టిన భక్తులు
గోల్కొండ: గోల్కొండ కోట జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆషాఢమాసం బోనాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అమ్మవారికి మొత్తం 9 వారాల పాటు పూజలు నిర్వహించనున్నారు. మొదటి పూజకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు అమ్మవారికి పట్టువ్రస్తాలు సమరి్పస్తారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ వారు ప్రత్యేకంగా అలంకరించిన దేవతా విగ్రహాల వాహనాలతో ఊరేగింపు నిర్వహిస్తారు. జానపద కళాకారులు ప్రత్యేకంగా పాటలు పాడుతూ భక్తులను ఉత్సాహపరుస్తారు. గోల్కొండ ప్రధాన రహదారి నుంచి తొట్టెల ఊరేగింపు వైభవంగా ప్రారంభమవుతుంది. కోటలోని జగదాంభిక, మహంకాళి అమ్మవార్ల దర్శనానికి మొదటి బోనం రోజున వేలాధిగా భక్తులు తరలిరానున్నారు. వీరికి దారి పొడవునా దేవాదాయ శాఖ వారు స్వాగత వేదిక ఏర్పాట్లు చేశారు.
ఆకట్టుకునే పోతరాజుల విన్యాసాలు..
బోనాల్లో పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. వారి విన్యాసాలు చూసేందుకు అన్ని వర్గాల ప్రజలు రోడ్డుకిరువైపులా బారులు తీరి వీక్షిస్తుంటారు. ఓవైపు పోతరాజుల గీంకారాలు, కొరఢా చప్పుళ్లు మరోవైపు శివసత్తుల పునకాలతో మొత్తం ఆధ్యాత్మికత వాతావరణం సంతరించుకోనున్నాది.
మెట్టు మెట్టుకు బొట్టు..
బుధవారం అమావాస్యను పురస్కరించుకుని కోట మెయిన్ గేటు నుంచి అమ్మవారి ఆలయానికి వెళ్లే మెట్లను మహిళలు బొట్టు పెట్టి అలంకరించారు. నగరం నలుమూలల నుంచి మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి భక్తిశ్రద్ధలతో మెట్లతో పాటు మెట్లను ఆనుకుని ఉన్న కోట గోడలకు సైతం బొట్లు పెట్టి అలంకరించారు.
