ఫీజులు ఎందుకు పెంచాలి? | FRC questions for engineering college managements | Sakshi
Sakshi News home page

ఫీజులు ఎందుకు పెంచాలి?

Jun 16 2026 4:00 AM | Updated on Jun 16 2026 4:00 AM

FRC questions for engineering college managements

అన్ని ఖర్చులూ విద్యార్థుల నుంచే వసూలు చేస్తారా? 

ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలకు ఎఫ్‌ఆర్‌సీ ప్రశ్నలు 

ఆడిట్‌ రిపోర్టులు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని వెల్లడి 

ఫీజులు పెంచకపోతే వేతనాలు ఇవ్వలేమంటున్న కాలేజీలు

సాక్షి, హైదరాబాద్‌: మీరు కోరినంత ఫీజులు ఎందుకు పెంచాలి? అన్ని ఖర్చులూ విద్యార్థుల నుంచే వసూలు చేయడం సరైనదేనా? కాలేజీల్లో నాణ్యత ప్రమాణాలున్నాయని చెప్పేందుకు ఆధారాలేంటి? మూడేళ్లుగా కొత్తగా తీసుకొచ్చిన లేబోరేటరీలెన్ని? లైబ్రరీలెన్ని?.. ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలకు రాష్ట్ర ఫీజుల నియంత్రణ కమిటీ (ఎఫ్‌ఆర్‌సీ) వేసిన ప్రశ్నలివి. కోర్టు ఆదేశంతో కొన్ని ఇంజనీరింగ్‌ కాలేజీల ఫీజుల వ్యవహారంపై ఎఫ్‌ఆర్‌సీ సోమవారం విచారణ చేపట్టింది. తొలిరోజు ఆరు కాలేజీల ప్రతినిధులు హాజరయ్యారు.

వాస్తవానికి ప్రతి మూడేళ్ళకోసారి ఇంజనీరింగ్‌ ఫీజులను కమిటీ సమీక్షిస్తుంది. ఈ మేరకు 2025–26 విద్యా సంవత్సరంలో ఫీజులను ఖరారు చేసింది. అయితే కాలేజీల ఆడిట్‌ రిపోర్టులపై ఆరోపణలు రావడంతో ప్రభుత్వం గత ఏడాది ఫీజుల ఖరారును నిలిపివేసింది. తిరిగి విచారణ చేపట్టిన అనంతరం కొన్ని కాలేజీలకు ఫీజులు పెంచారు. మరికొన్ని కాలేజీలకు తగ్గించారు. దీంతో ఫీజులు తగ్గించిన కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి. విచారణ జరిపిన కోర్టు మరోసారి పరిశీలించాలని ఎఫ్‌ఆర్‌సీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం కూడా కాలేజీల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుండగా.. ప్రభుత్వం కోర్టుకు నివేదించనుంది. 

నిర్వహణ ఖర్చు పెరిగింది: కాలేజీలు 
కాలేజీల నిర్వహణ ఖర్చు విపరీతంగా పెరిగిందని కాలేజీల యాజమాన్యాలు ఎఫ్‌ఆర్‌సీ ముందు వాదించాయి. తాజా ఆడిట్‌ రిపోర్టులను కమిటీకి అందించాయి. వీటిని పరిశీలించిన కమిటీ సభ్యులు పలు ఖర్చులపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఉద్యోగాల కోసం ఇచ్చే శిక్షణను, పాలనాపరమైన అవసరాలకు వెచి్చంచే మొత్తాన్ని, జాతీయ ర్యాంకుల కోసం ఖర్చు చేసే వ్యయాన్ని ఆడిట్‌లో పొందుపర్చడం సరికాదని అభిప్రాయపడినట్టు తెలిసింది. జాతీయ ర్యాంకులే రాని కాలేజీలు, ఫ్యాకల్టీ కోసం ఎంతమాత్రం ఖర్చు చేయని కాలేజీల వైఖరిని ప్రశ్నించినట్టు సమాచారం.

అయితే మూడేళ్ళల్లో ఒకసారి ర్యాంకులు రానంత మాత్రాన దాన్ని కొలమానంగా తీసుకోవడం సరికాదని కాలేజీలు అంటున్నాయి. ప్రతి ఏటా బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలు పెంచుతున్నామని, ఫీజులు తగ్గించడం వల్ల వేతనాల్లో కోత పెట్టాల్సిన పరిస్థితి వచి్చందని చెబుతున్నాయి. ఇప్పటికే నైపుణ్యం ఉన్న అధ్యాపకులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళారని కమిటీ దృష్టికి తెచ్చాయి.  

ప్రభుత్వానికి నివేదిస్తాం: ఎఫ్‌ఆర్‌సీ 
కాలేజీల అభిప్రాయాలను తెలుసుకున్న ఎఫ్‌ఆర్‌సీ తమ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని యాజమాన్యాలకు తెలిపింది. ఆడిట్‌ నివేదికలను నిపుణుల పరిశీలనకు ఇవ్వాలని భావిస్తోంది. మంగళవారం మరికొన్ని కాలేజీల వాదన విన్న తర్వాత అన్నిటినీ నిపుణులకు అందజేయనుంది. అవసరమైతే అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీల ప్రతినిధులతో కలిసి కాలేజీలను తనిఖీ చేయాలని, మౌలిక వసతుల కల్పన, ఫ్యాకల్టీని పరిశీలించిన తర్వాత ఫీజులపై ఓ నిర్ణయానికి రావాలని ఎఫ్‌ఆర్‌సీ భావిస్తున్నట్టు తెలిసింది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement