కరెంట్‌ షాక్‌తో నలుగురి దుర్మరణం | Four people die due to electric shock | Sakshi
Sakshi News home page

కరెంట్‌ షాక్‌తో నలుగురి దుర్మరణం

Jun 26 2025 2:59 AM | Updated on Jun 26 2025 2:59 AM

Four people die due to electric shock

వేర్వేరు చోట్ల తండ్రీకొడుకు, రైతు, జూనియర్‌ లైన్‌మ్యాన్‌ మృతి

ఇల్లెందురూరల్‌/నేరడిగొండ/గంగారం : వేర్వే రు చోట్ల విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మూడు జిల్లాల పరిధిలో బుధవారం ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం ఎల్లాపురం గ్రామానికి చెందిన ఏనుగు నర్సయ్య (60), ఎర్రమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. అందరికీ వివాహాలు జరగ్గా, చిన్న కుమారుడు ప్రవీణ్‌ (35) తల్లిదండ్రులతో కలసి ఉంటున్నాడు. పొలం పనులకు వెళ్లాలని బుధవారం తెల్లవారుజామునే నిద్రలేచారు. 

మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో ఆరుబయట నేల బురదమయంగా మారింది. ముందుగా ఎర్రమ్మ నిదానంగా అడుగులు వేస్తూ చేతికందే ఎత్తులో ఉన్న దండెం తీగను ఆసరాగా పట్టుకుంది. అప్పటికే విద్యుత్‌ సర్వీసు వైరుకు తగిలి ఉన్న దండెం నుంచి కరెంట్‌ ప్రసారం కావడంతో ఎర్రమ్మ షాక్‌తో కింద పడింది. ఆ వెనుకాల వస్తున్న నర్సయ్య.. భార్య జారి పడిందని భావించి పైకిలేపే ప్రయత్నం చేయగా ఆయనకు కూడా షాక్‌ తగలడంతో బిగ్గరగా అరిచాడు. 

ఏం జరిగిందోనని పరుగున బయటకు వచ్చిన ప్రవీణ్‌ నేరుగా వారి వద్దకు వెళ్లి కాపాడే ప్రయత్నం చేయడంతో ఆయనా షాక్‌కు గురయ్యాడు. ఈ ప్రమాదంలో నర్సయ్య, ప్రవీణ్‌ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఎర్రమ్మను స్థానికులు తొలుత ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మంకు తరలించారు.  

ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం లింగట్ల గ్రామానికి చెందిన యువ రైతు సాబ్లే సుభాష్‌ (35) తన పత్తి చేలో కలుపు తీస్తుండగా.. వేలాడుతున్న విద్యుత్‌ తీగ ప్రమాదవశాత్తు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, విద్యుత్‌ తీగలు వేలాడుతున్న విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైందని మృతుని బంధువులు ఆరోపించారు.  

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన చిలుక ప్రవీణ్‌(28) గత ఏడాది మార్చిలో జూనియర్‌ లైన్‌మ్యాన్‌గా మహబూబాబాద్‌ గంగారం మండలంలో విధుల్లో చేరారు. కోమట్లగూడెం రోడ్డు సమీపంలో బుధవారం రాత్రి త్రీఫేజ్‌ విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో సబ్‌స్టేషన్‌ నుంచి ఎల్‌సీ తీసుకొని మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్‌ ప్రసారం కావడంతో ప్రవీణ్‌ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య సౌమ్య ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భవతి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement