ఏడుకొండలు (ఫైల్) , స్టేషన్ వద్ద విలపిస్తున్న ఏడుకొండలు సోదరి
నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్స్టేషన్లో వ్యక్తి మృతి!
పోలీసు దెబ్బలకు తాళలేకే చనిపోయాడంటున్న స్థానికులు
గడ్డి మందు తాగి చనిపోయాడంటున్న పోలీసులు
గుట్టుచప్పుడు కాకుండా మృతదేహం తరలింపు
సాక్షి టాస్క్ ఫోర్స్: చంద్రబాబు సర్కారులో వరుస లాకప్ డెత్లు రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. ఇటీవల విజయవాడలో కాపు యువకుడు సాయికృష్ణ లాకప్ డెత్, తర్వాత శవాన్ని మాయం చేయడం సర్కారు కిరాతకానికి పరాకాష్ట. తాజాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మరో లాకప్ డెత్ చోటు చేసుకుంది. బంగారు గొలుసు చోరీ కేసులో నెల్లూరు జిల్లా మనుబోలు పోలీసులు తీసుకొచ్చిన బొల్లి ఏడుకొండలు (50) మంగళవారం పోలీసు స్టేషన్లోనే అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పోలీసు దెబ్బలకే అతను చనిపోయాడని స్థానికులు అంటుండగా.., గడ్డి మందు తాగి చనిపోయాడని పోలీసులు అంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఓ బంగారు గొలుసు దొంగతనం కేసులో చెరుకుమూడి గ్రామానికి చెందిన బొల్లి ఏడుకొండలును మనుబోలు పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లో విచారించారు. ఆ తర్వాత స్టేషన్ బెయిల్పై విడిచి పెట్టారు. ఈ క్రమంలో మంగళవారం ఏడుకొండలు గ్రామంలో ఉన్నాడని ఎవరో పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. పోలీసులు చెరుకుమూడి వెళ్లి ఏడుకొండలును తిరిగి అదుపులోకి తీసుకుని, స్టేషన్కు తీసుకెళ్లి చితకబాదినట్లు సమాచారం. దెబ్బలకు తాళలేక అతను మృతి చెందడంతో గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని చెరుకుమూడి దారిలో పడేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఏడుకొండలు మృతదేహాన్ని ఎవరికీ చూపించకుండా పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఏడుకొండలు సోదరి మంగళవారం రాత్రి స్టేషన్ చేరుకుని మా తమ్ముడిని తీసుకొ చ్చి, ఏమి చేశారంటూ విలపించడం కంట తడి పెట్టించింది. కాగా, ఏడుకొండలు గడ్డి మందు తాగి చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు.


