వికటించిన మధ్యాహ్న భోజనం | Food Poisoning Incident in Karimnagar District: telangana | Sakshi
Sakshi News home page

వికటించిన మధ్యాహ్న భోజనం

Nov 23 2024 4:44 AM | Updated on Nov 23 2024 4:44 AM

Food Poisoning Incident in Karimnagar District: telangana

ముగ్గురు విద్యార్థులకు వాంతులు.. 20 మందికి కడుపునొప్పి 

కరీంనగర్‌ జిల్లా బూర్గుపల్లి పాఠశాలలో ఘటన

గంగాధర (చొప్పదండి): కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం బూర్గుపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించింది. శుక్రవారం మధ్యాహ్నం అన్నం తిన్న పలువురు విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మొత్తం 205 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో శుక్రవారం 180 మంది హాజరయ్యారు. మధ్యాహ్న సమయంలో పాఠశాలలో వండిన భోజనం తిన్నారు. కాసేపటికి ముగ్గురు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు.

ఇది చూసిన మరో 20 మంది విద్యార్థులు కడుపునొస్తోందని ఉపాధ్యాయులకు చెప్పారు. వెంటనే వారు ప్రభుత్వ వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి వైద్యం అందించి, మాత్రలు ఇచ్చారు. విషయం తెలుసుకున్న పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. మధ్యాహ్న భోజనానికి వండిన బియ్యం కొత్తవి కావడంతో పాటు అన్నం మెత్తగా కావడం వల్ల విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని ఎంఈవో ప్రభాకర్‌రావు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement