షాద్‌నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 50 మంది | Fire Accident At shadnagar Pharma Company | Sakshi
Sakshi News home page

షాద్‌నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 50 మంది

Apr 26 2024 7:56 PM | Updated on Apr 26 2024 7:56 PM

Fire Accident At shadnagar Pharma Company

సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నందిగామ మండల కేంద్రంలోని అల్విన్‌ ఫార్మసీ కంపెనీలో ప్రమదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అగ్నికీలలు ఎగిసిపడటంతో.. కంపెనీ మొత్తానికి మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో కంపెనీలో సుమారు 100కుపైగా కార్మికులు ఉండగా.. ప్రాణ భయంతో చాలా మంది బయటకు పరుగులు తీశారు. అయితే.. దట్టమైన పొగ అలుముకోవటంతో.. ఎటువెళ్లలేక సుమారు 50 మంది వరకు లోపలే చిక్కుకుపోయినట్టుగా తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయిదు ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పరిశ్రమను ఆనుకుని నూతనంగా నిర్మిస్తున్న షెడ్డులో వెల్డింగ్‌ పనులు జరుగుతుండగా.. మంటలు అంటుకున్నాయని కార్మికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 50 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. కొందరు కార్మికులను కిటికీల్లోంచి నిచ్చెనల సాయంతో బయటకు తీసుకొచ్చారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందన్నది తెలియాల్సి ఉంది.

బాలుడి సాహసం
అగ్ని ప్రమాద సమయంలో ఓ బాలుడు ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. ప్రమాదాన్ని ముందుగా గుర్తించిన బాలుడు సాయిచరణ్‌.. కంపెనీ మంటల్లో చిక్కుకున్న బాధితులను కాపాడాడు. అగ్నిప్రమాద తీవ్రతను పసిగట్టిన బాలుడు.. భవనం పైకి ఎక్కి తాడు కట్టాడు. కిటీకి ద్వారా కార్మికులు కిందకు దిగేందుకు సాయచరణ్‌ సాయం చేశాడు. మొత్తం 50 మందిని కార్మికులను కాపాడాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement