చిన్నారికి చిత్రహింసలు  | Sakshi
Sakshi News home page

చిన్నారికి చిత్రహింసలు 

Published Sun, Dec 12 2021 2:47 AM

Father Tortured His Three Year Old Son In Medak District - Sakshi

తూప్రాన్‌: మద్యం తాగేందుకు భార్య డబ్బులు ఇవ్వలేదని ఆవేశంతో మూడేళ్ల కొడుకును విచక్షణ రహితంగా చితకబాదాడొక తండ్రి. ఈ ఘటన మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం ఇస్లాంపూర్‌ గ్రామంలో శనివారం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్లాంపూర్‌లో బెడ బుడగ జంగాల కాలనీకి చెందిన గణేశ్, పుష్ప దంపతులకు ఇద్దరు కొడుకులు. దంపతులిద్దరూ కూలి పనులు చేస్తూ జీవిస్తున్నారు. గణేశ్‌ మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతూ భార్య పుష్పతో నిత్యం గొడవ పడేవాడు.

ఈ క్రమంలోనే తనకు రూ.5 వేలు కావాలని, ఇందుకోసం ఆమె వెండి పట్టీ గొలుసులు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన గణేశ్‌ భార్యపై రాయితో దాడి చేసేందుకు యత్నించాడు. ఆమె తప్పించుకోవడంతో ఎదురుగా ఉన్న మూడేళ్ల కొడుకు హర్షవర్ధన్‌ను కర్రతో పైశాచికంగా చితకబాదాడు. బాలుడి వీపు, ముఖం, శరీర భాగాలపై తీవ్రంగా గాయాలయ్యాయి.

భార్యను సైతం చంపుతానని భయభ్రాంతులకు గురిచేశాడు. చుట్టు పక్కల వారితో కలిసి బిడ్డను పట్టణ ప్రభుత్వాస్పత్రికి చికిత్సకు తరలించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాత్రి ఇంటికి వెళ్తే తిరిగి ఎక్కడ కొడతాడోనని భయంతో పుష్ప మాసాయిపేటలోని పుట్టింటికి ఇద్దరు పిల్లలతో వెళ్లింది. ప్రస్తుతం గణేశ్‌ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
Advertisement