
భర్తపై ఫిర్యాదు చేసిన భార్య
సైదాబాద్(హైదరాబాద్): తెలిసో తెలియకో చిన్న పిల్లలు తప్పులు చేస్తే తల్లిదండ్రులు చీవాట్లు పెట్టడం సర్వసాధారణం. కానీ కన్నకూతురు తప్పు చేసిందో లేదో నిర్ధారించుకోకుండానే ఒక తండ్రి విచక్షణారహితంగా ముఖంపైన, చేతులపైన వాతలు పెట్టాడు. ఎంతగా అంటే ఆ చిన్నారి ప్రస్తుతం ఆసపత్రిలో చేరి చికిత్స పొందుతోంది. దాంతో తట్టుకోలేక పోయిన ఆ పాప తల్లి భర్తపైనే సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సుబ్రమణ్యనగర్లో నివససించే ఆర్.హర్యా, జ్యోతి దంపతులు కూలి పనులు చేస్తుంటారు. వారికి ఇద్దరు కుమారులు, కూతురు (11) సంతానం. కుమార్తె స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటుంది. ఎండాకాలం సెలవులు కావటంతో కుమార్తెను తల్లిదండ్రులు బిజినేపల్లి మండలం గంగారం గ్రామంలోని నానమ్మ ఇంటికి పంపారు. నెల రోజులు అక్కడే ఉన్న బాలిక ఈ నెల 6న తిరిగి ఇంటికి వచి్చంది.
అదేరోజు రాత్రి హర్యాకు అతని తమ్ముడు గ్రామం నుంచి ఫోన్ చేసి సెలవుల్లో ఇక్కడికి వచ్చిన కుమార్తె ఒకరితో చనువుగా ఉందని చెప్పాడు. అప్పటికే మద్యం సేవించి ఉన్న తండ్రి హర్యా కోపోద్రిక్తుడై వంటింట్లోని అట్ల కాడను కాల్చి కుమార్తె ముఖం, చేతులపై వాతలు పెట్టాడు. దాంతో తీవ్రగాయాలైన ఆమెను తల్లి జ్యోతి ఉస్మానియా ఆసుపత్రికి తరలించింది. తన మరిది చెప్పిన మాటలు విని..నిజానిజాలు తెలుసుకోకుండా కూతురిని గాయపరిచిన భర్తపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని జ్యోతి సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.