
పొట్టదశలో ఎండుతున్న పంటలు
సాగునీటి కోసం రైతుల నిరసన బాట
కుంటాల/భైంసారూరల్/కడెం : నిర్మల్ జిల్లాలో పలుచోట్ల చివరి దశలో పొలాలు ఎండిపోతున్నాయి. ఒకటి, రెండు తడులతో పంట చేతికి రానుండగా భూగర్భజల మట్టాలు పడిపోయాయి. బోర్లు, వ్యవసాయబావులు వట్టిపోయాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కుంటాల మండలం లింబా(బీ) గ్రామానికి చెందిన రైతు కేశెట్టి అశోక్కుమార్ 12 ఎకరాల్లో వరి సాగు చేశాడు. చివరి తడి అందక నాలుగెకరాలు ఎండిపోగా పశువులకు మేతయింది.
భైంసా మండలం కామోల్ గ్రామంలో పంట పొట్ట దశలో ఉండగా రెండు తడులు అవసరముంది. ఇక్కడా బోర్లు, బావుల్లో చుక్క నీరు లేక పంటలు ఎండుతున్నాయి. గడ్డెన్నవాగు ప్రాజెక్ట్ నుంచి సాగునీరు వదిలి పంటలు కాపాడాలని గ్రామానికి చెందిన రైతులు బుధవారం ఎండుతున్న పొలంలో నిల్చుని నిరసన తెలిపారు.
సదర్మాట్ ఆయకట్టు చివరి ప్రాంతాలైన కడెం మండలంలోని కొత్తమద్దిపడగ, పాతమద్దిపడగ తదితర గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఆయా గ్రామాల రైతులంతా చివరి ఆయకట్టుకు మరికొద్ది రోజులు సాగునీరు ఇవ్వాలని బుధవారం కాలువలో నిల్చుని నిరసన తెలిపారు.