రైతుల చేతులకు సంకెళ్లు! | Farmers arrested for opposing the establishment of an ethanol company | Sakshi
Sakshi News home page

రైతుల చేతులకు సంకెళ్లు!

Jun 19 2025 3:45 AM | Updated on Jun 19 2025 9:04 AM

Farmers arrested for opposing the establishment of an ethanol company

పోలీసుల తీరుపై విమర్శలు 

ధన్వాడకు చెందిన 12 మందికి మంగళవారమే బెయిల్‌ మంజూరు  

అయినా సంకెళ్లు వేసి కోర్టులో హాజరుపరిచిన వైనం.. ముగ్గురిని సస్పెండ్‌ చేశామన్న గద్వాల ఎస్పీ

అలంపూర్‌: ఇథనాల్‌ కంపెనీ ఏర్పాటనును వ్యతిరేకించే క్రమంలో చోటు చేసుకున్న గొడవతో రిమాండ్‌లో ఉన్న రైతులకు పోలీసులు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకురావడం వివాదాస్పదమైంది. వివరాల్లోకి వెళితే.. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో గాయత్రి రెన్యూవబుల్‌ ఆన్‌లైన్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ ఇథనాల్‌ కంపెనీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే దీనిని పెద్ద ధన్వాడతో పాటు ఆ చట్టూ ఉన్న 12 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

ఈ క్రమంలో ఈ నెల 4వ తేదీన కంపెనీ నిర్మాణ పనులు ఆరంభించడానికి యాజమాన్యం సామగ్రి సిద్ధం చేసుకుంది. దీన్ని ప్రజలు అడ్డుకునే క్రమంలో తీవ్ర ఉద్రికత్త చోటు చేసుకుంది. దీంతో 41 మంది రైతులపై రాజోలి పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. అందులో 12 మంది రైతులను ఈ నెల 5వ తేదీన గద్వాల కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించారు. వీరికి సంబంధించి బుధవారం వాయిదా ఉండటంతో అలంపూర్‌ కోర్టులో హాజరుపర్చారు. అయితే వీరి చేతులకు సంకెళ్లు వేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. 

అన్నం పెట్టే రైతన్నల చేతికి కరుడుగట్టిన నేరస్తుల తరహాలో సంకెళ్లు వేయడం ఏమిటంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఈ దృశ్యాలను సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఆ తర్వాత మీడియాలో కథనాలుగా రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమయ్యింది. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు రైతులకు మద్దతుగా నిలిచాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం.  

17నే బెయిల్‌ మంజూరు ఎట్టకేలకు విడుదల
మహబూబ్‌నగర్‌ జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న రైతులకు వాస్తవానికి మంగళవారమే బెయిల్‌ మంజూరైంది. గద్వాల కోర్టు 12 మంది రైతులకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. రైతులు ఒకవైపు కోర్టు వాయిదాకు హాజరు కాగా.. మరోవైపు వారి బెయిల్‌కు సంబంధించిన జామీన్‌ల ప్రక్రియ కొనసాగింది. చివరకు బుధవారం రాత్రి రైతులు బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం మాట్లాడుతూ పచ్చని పొలాల్లో ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటుతో రైతుల జీవితాల్లో కాంగ్రెస్‌ పార్టీ చిచ్చు పెట్టిందని ఆరోపించారు.

ముగ్గురు పోలీస్‌ అధికారుల సస్పెన్షన్‌ 
ఈ ఉదంతంపై జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌రావును ‘సాక్షి’ సంప్రదించగా..ఇందుకు కారణమైన ముగ్గురు అధికారులను సస్పెండ్‌ చేసినట్లు ఆయన తెలిపారు. రైతులను జైలు నుంచి కోర్టుకు తీసుకొచ్చే క్రమంలో పోలీస్‌ ఉన్నతాధికారుల సూచనలు పాటించకుండా విధుల పట్ల అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంఘటనలో ఒక ఆర్‌ఎస్‌ఐ, ఇద్దరు ఏఆర్‌ ఎస్‌ఐలను సస్పెండ్‌ చేశామని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement