డిప్లొమా విద్యార్థి ఆత్మహత్య | Diploma student commits suicide | Sakshi
Sakshi News home page

డిప్లొమా విద్యార్థి ఆత్మహత్య

Sep 22 2024 10:53 AM | Updated on Sep 22 2024 10:53 AM

Diploma student commits suicide

మధురవాడ: టీడీపీ మాజీ ఎమ్మెల్సీకి చెందిన చైతన్య ఇంజనీరింగ్‌ కళాశాలలో చదువుతున్న డిప్లొమా విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పీఎంపాలెం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పార్వతీపురం మన్యం జిల్లా నర్సిపురం బీజీ కాలనీకి చెందిన నిండుగొండ శంకరరావు, జ్ఞానేశ్వరి కుమారుడు జ్యోతి ప్రకాశ్‌ (16) విశాఖ నగర శివారు కొమ్మాది చైతన్య వ్యాలీ­లో­ని చైతన్య ఇంజనీరింగ్‌ కళాశాలలో డిప్లమా మెకాని­కల్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. 

కళాశాలలోని బాయ్స్‌ హాస్టల్‌ బ్లాక్‌ ఎఫ్‌–7లో ఏడుగురు వి­ద్యా­ర్థులతో కలిసి ఉంటున్నాడు. శుక్రవారం తల్లితో ఫోన్‌లో మాట్లాడిన జ్యోతి ప్రకాశ్‌.. అక్టోబర్‌ మొదటి వారంలో పరీక్షలు ఉండడంతో ఆందోళనగా ఉందని చెప్పాడు. శనివారం ఉదయం కాస్త కడుపు నొప్పిగా ఉందని, క్లాసుకి వెళ్లలేనని తల్లికి మళ్లీ ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో ఆమె వార్డెన్‌కు ఫోన్‌ చేసి హాస్టల్‌లో ఉంచాలని చెప్పింది. మధ్యాహ్నం 1.30 సమయంలో ఇదే గదిలో ఉంటున్న సహచర విద్యార్థి తలుపు కొట్టగా తియ్యలేదు. 

దీంతో హాస్టల్‌ సిబ్బంది బలవంతంగా తలుపులు తీయగా.. జ్యోతిప్రకాశ్‌ ఫ్యాన్‌కి ఉరేసుకుని ఉన్నాడు. వైద్యం నిమిత్తం సమీపంలోని గాయత్రి హాస్పిటల్‌కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.  విద్యార్థి మృతికి గల కారణాలు తెలియరాలేదని పీఎంపాలెం సీఐ గేదెల బాలకృష్ణ చెప్పారు. కాగా కొద్ది నెలల క్రితం ఇదే క్యాంపస్‌లో ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఒకే ఏడాదిలో ఇద్దరు విద్యార్థులు చనిపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. తల్లి జ్ఞానేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement