Lockdown: మాస్కులు లేకుండా తిరిగిన వారినుంచి రూ. 31 కోట్ల వసూలు

DGP Report Submitted To HC On Corona Regulations In State - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ‌లో మాస్కులు లేని వారి నుంచి మొత్తం రూ.31 కోట్లు వ‌సూలు చేశామని తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి హైకోర్టుకు నివేదిక సమర్పించారు. బ్లాక్ మార్కెట్‌లో ఔష‌ధ‌ల అమ్మ‌కాల‌పై 98 కేసులు నమోదు చేసినట్లు, మాస్కులు ధ‌రించ‌ని వారిపై 3,39,412 కేసుల ఫైల్‌ చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. తెలంగాణ‌లో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.

ఈ రోజు(మంగళవారం) విచార‌ణ‌కు హైద‌రాబాద్, సైబ‌రాబాద్, రాచ‌కొండ సీపీలు హాజ‌ర‌య్యారు. అలాగే, తెలంగాణ‌లో లాక్‌డౌన్‌, క‌రోనా నిబంధ‌న‌ల‌పై డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి హైకోర్టుకు నివేదిక అందించారు. ఇందులో భాగంగా.. భౌతిక దూరం పాటించ‌నందుకు మొత్తం  22,560 కేసులు న‌మోదయ్యాయని డీజీపీ న్యాయస్థానానికి వివరించారు.

క‌రోనా నేప‌థ్యంలో క‌ట్ట‌డికి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని డీజీపీ చెప్పారు. బ్లాక్ మార్కెట్‌లో ఔష‌ధ‌ల అమ్మ‌కాన్ని నిరోధిస్తున్నామ‌ని, ఇప్ప‌టికి 98 కేసులు న‌మోదు చేశామ‌ని వివ‌రించారు.  లాక్‌డౌన్  ప‌క‌డ్బందీ అమ‌లుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. ఈ నెల 1 నుంచి 14 వ‌ర‌కు నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల కింద మొత్తం 4,31,823 కేసులు న‌మోదు చేశామ‌ని చెప్పారు. మాస్కులు ధ‌రించ‌ని వారికి మొత్తం రూ.31 కోట్ల జ‌రిమానా విధించామ‌ని తెలిపారు.

కాగా లాక్‌డౌన్‌, రాత్రి క‌ర్ఫ్యూ అమ‌లు తీరుపై హైకోర్టు సంతృప్తి వ్య‌క్తం చేసింది. వ్యాక్సినేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వృద్ధులు, పేదవారికి వ్యాక్సినేషన్ కోసం ఎన్‌జీవోలతో ఒప్పందం చేసుకుని డ్రైవ్ ఇన్ వ్యాక్సినేషన్ పెట్టాలని సూచించింది. ఎన్నిక‌ల విధుల్లో ఉండి కరోనా బారిన పడిన టీచర్లను క‌రోనా వారియర్లుగా గుర్తించాలని హైకోర్టు చెప్పింది.

చదవండి: 
TS: ‘వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ఎందుకు నిర్వహించడంలేదు’

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top