అంత ‘స్పేస్‌’ వద్దు!

Corona Effect IT Companies Decreasing Space Office - Sakshi

కోవిడ్‌ నేపథ్యంలో ఐటీ కంపెనీల  పొదుపు మంత్రం

అద్దె భారంతో ఆఫీస్‌ స్పేస్‌ తగ్గించుకునే యత్నం

లీజు ఒప్పందాలను పునః సమీక్షించు కుంటున్న సంస్థలు

25% కంపెనీలు ఆఫీస్‌ స్పేస్‌ తగ్గించుకున్నట్టు హైసియా సర్వేలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ నేపథ్యంలో పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోం వెసులుబాటును డిసెంబర్‌ వరకు పొడిగించాయి. ఇన్ఫోసిస్, గూగుల్‌ వంటి పెద్ద ఐటీ కంపెనీలు వచ్చే ఏడాది మార్చి వరకు ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించాయి. దీంతో మిగతా కంపెనీలు కూడా అదే యోచనలో ఉన్నాయి. మరోవైపు ఐటీ కంపెనీలు.. ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల పనితీరును రెగ్యులర్, స్టాండప్, స్టార్టప్‌ కాల్స్‌తో పాటు స్క్రీన్‌ మానిటరింగ్‌ విధానంలో పర్యవేక్షిస్తూ గతంలో 9 గంటలున్న పనివేళలను ప్రస్తుతం 12 గంటలకు పెంచినట్లు తెలుస్తోంది. వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానం పొడిగింపుతో ఐటీ కంపెనీ కార్యాలయాలు, ఐటీ కారిడార్లు మరికొంత కాలం బోసిపోనున్నాయి. 

ఆఫీస్‌ స్పేస్‌ తగ్గింపుపై కసరత్తు
గతేడాది ఆఫీస్‌ స్పేస్‌ విషయంలో బెంగళూరును అ«ధిగమించిన హైదరా బాద్‌.. వచ్చే మూడేళ్లలో అగ్రస్థానానికి చేరుతుందని అంచనా వేశారు. నగరం లోని ఆఫీస్‌స్పేస్‌లో 50% ఐటీ కంపె నీలే ఉపయోగిస్తున్నాయి. లుక్‌ ఈస్ట్‌ పాలసీ, గ్రోత్‌ డిస్పెన్షన్‌ పాలసీల్లో భాగంగా భవిష్యత్తులో ఐటీ ఆఫీస్‌ స్పేస్‌ మరింత పెరుగుతుందని రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు అంచనా వేశాయి. అయితే కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో ఐటీ రంగంలో పెద్దసంఖ్యలో ఉన్న ఎంఎస్‌ఎంఈ కంపె నీలు ఆఫీస్‌స్పేస్‌ను తగ్గించుకోవ డంపై దృష్టిపెట్టాయి. ‘ప్లగ్‌ అండ్‌ ప్లే’ విధానంలో ఆఫీస్‌స్పేస్‌ను అద్దెకిస్తున్న సంస్థలు ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిగా దెబ్బ తిన్నాయి. సీట్ల సంఖ్య ఆధారంగా వసతులను బట్టి గతంలో ఒక్కో సీటుకు రూ.5 వేల నుంచి రూ.15 వేలు వసూలు చేసిన సంస్థలు ప్రస్తుతం నష్టాల్లో కూరుకుపోయాయి.

లీజు ఒప్పందాలపైనా పునః సమీక్ష
కార్యాలయాలను అద్దెకు తీసుకున్న పలు చిన్నా చితకా ఐటీ కంపెనీలు అద్దె భారం, నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టిపెట్టాయి. ప్రధానంగా భవన యజమానులతో కుదుర్చుకున్న అద్దె ఒప్పందాలను పునఃసమీక్షించుకుంటూ ఆఫీస్‌ స్పేస్‌ను తగ్గించుకోవడమో లేదా కార్యాలయాలను ఖాళీ చేయడమో చేస్తున్నాయి. అద్దె భారాన్ని మోయలేని కొన్ని సంస్థలు లీజు పీరియడ్‌ను తగ్గించు కోవడం లేదా అద్దె మొత్తాన్ని తగ్గించుకునేందుకు యాజమాన్యాలతో బేరసారాలు సాగిస్తున్నాయి. అయితే మైక్రోసాఫ్ట్, విప్రో, గూగుల్, టీసీఎస్‌ వంటి సొంత ప్రాంగణాలను కలిగి ఉన్న సంస్థలు మాత్రం ఆఫీస్‌ స్పేస్‌ తగ్గింపు దిశగా యోచించట్లేదు.

విడ్‌ పరిస్థితుల్లో ఐటీ కంపెనీల కార్యకలాపాలపై హైదరా బాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసి యేషన్‌ గత నెలలో సర్వే నిర్వహించింది. కోవిడ్‌కు ముందు పదివేలలోపు చదరపు అడుగుల విస్తీర్ణంలో 32.6%, 50వేల లోపు 37.2%, లక్షలోపు 6%, లక్ష నుంచి ఐదు లక్షలలోపు 11.6%, 5 లక్షల చద రపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో 14% కంపెనీలు కార్యకలాపాలు నిర్వ హిస్తున్నాయి. కోవిడ్‌ నేపథ్యంలో 12.8% కంపెనీలు ప్రస్తుతమున్న చోటే యథా విధిగా అద్దె చెల్లిస్తూ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 33% కంపెనీలు మాత్రం అద్దె తగ్గింపునకు సంబంధించి భవన యాజమానులతో బేరసారాలు కుదుర్చు కున్నాయి. 24.1% కంపెనీలు ఆఫీస్‌ స్పేస్‌ను 25% నుంచి వంద శాతానికి తగ్గించుకున్నట్లు హైసియా సర్వే వెల్ల డించింది. మరో 43.6% కంపెనీలు ఆఫీస్‌ స్పేస్‌ వివరాలు వెల్లడించలేదు.

కోవిడ్‌ మూలంగా ఐటీ కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యలను అవగాహన చేసుకునేందుకు గత నెలలో సర్వే నిర్వహించాం. వర్క్‌ ఫ్రమ్‌ హోం, ఆఫీస్‌ స్పేస్‌ మొదలు అనేక అంశాలపై వివ రాలు సేకరించి విశ్లేషించాం. ఐటీ కంపె నీల ఆర్థిక కార్యకలాపాలపై ఈ ఏడాది చివరిలోగా స్పష్టత రావచ్చు. హైదరా బాద్‌ ఐటీ వాణిజ్యం ఎక్కువగా యూఎస్‌తో పాటు యూరోప్‌ దేశాలపై ఆధారపడి ఉంది. అక్కడి పరిణామాల పైనే స్థానిక ఐటీ రంగం చాలావరకు ఆధారపడి ఉంది. ఆఫీస్‌ స్పేస్‌ లీజు ఒప్పందాలను చిన్న ఐటీ కంపెనీలు పునః సమీక్షించుకుంటున్నాయి.
– భరణికుమార్‌ ఆరోల్, అధ్యక్షుడు, హైసియా

సీటింగ్‌ వ్యయాన్ని తగ్గించుకుంటున్నాం
గతంలో ప్లగ్‌ అండ్‌ ప్లే కార్యాలయంలో మా సిబ్బంది కోసం ప్రతీ నెలా రూ.60వేలు అద్దె చెల్లించే వాళ్లం. కోవిడ్‌ నేపథ్యంలో ఆరు నెలలుగా ఖర్చును తగ్గించు కునేందుకు ఆఫీస్‌స్పేస్‌ తగ్గించుకున్నాం. పొదుపు చర్యల్లో భాగంగా సిబ్బందికి ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించాం. వచ్చే ఏడాది బిజినెస్‌ ఎలా ఉంటుందో ఫిబ్రవరి తర్వాతే స్పష్టత రావచ్చు.  – ఆనంద్‌ వర్ధన్, ఐటీ హెచ్‌ఆర్‌ సర్వీసెస్‌ ఏజెన్సీ  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top