వ్యవసాయ రంగంలో మార్పులకు సహకార సంఘాలే కీలకం | Cooperatives are key to changes in the agricultural sector | Sakshi
Sakshi News home page

వ్యవసాయ రంగంలో మార్పులకు సహకార సంఘాలే కీలకం

Jun 12 2026 3:41 AM | Updated on Jun 12 2026 3:41 AM

Cooperatives are key to changes in the agricultural sector

నాస్‌ తాజా అధ్యయనం వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ రంగంలో సహకార సంఘాల ప్రాధాన్యం మరోసారి చర్చనీయాంశమైంది. చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంచడంలో సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పీఓలు) కీలక పాత్ర పోషిస్తాయని జాతీయ వ్యవసాయ శాస్త్రాల అకాడమీ (ఎన్‌ఏఏఎస్‌–నాస్‌) వెలువరించిన తాజా అధ్యయనం స్పష్టం చేసింది. ‘బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ ఇన్‌ అగ్రికల్చరల్‌ కోఆపరేటివ్స్‌ ఇన్‌ ది గ్లోబల్‌ అరేనా’పేరుతో విడుదలైన నివేదికలో ప్రపంచంలోని విజయవంతమైన సహకార నమూనాలను విశ్లేషించి భారత పరిస్థితులకు అన్వయిస్తూ పలు కీలక సూచనలు చేసింది. 

రైతులను మార్కెట్‌తో అనుసంధానించడం, విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయడం, ప్రాసెసింగ్, నిల్వ సదుపాయాలు కల్పించడం ద్వారా సహకార వ్యవస్థ వ్యవసాయంలో గణనీయమైన మార్పు తీసుకురాగలదని పేర్కొంది. భారత్‌లో దాదాపు 90 శాతం వ్యవసాయ కుటుంబాలు చిన్న, సన్నకారు రైతులవే. విత్తనాలు, ఎరువులు, యంత్రాలు, రుణాలు, నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌ వంటి సేవలను ఒకే వేదికపై అందించే సామర్థ్యం సహకార సంఘాలకు ఉందని వివరించింది.

భారత్‌లో 8 లక్షలకుపైగా సహకార సంఘాలు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8 లక్షలకుపైగా సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. వీటిలో 30 కోట్లకు పైగా సభ్యులు ఉన్నారు. వ్యవసాయం, పాల ఉత్పత్తి, ఎరువులు, గ్రామీణ రుణాలు, మార్కెటింగ్, నిల్వ తదితర రంగాల్లో ఇవి సేవలందిస్తున్నాయి. పాల రంగంలో అమూల్, ఎరువుల రంగంలో ఇఫ్కో వంటి సంస్థలు సహకార వ్యవస్థ ద్వారా ప్రపంచస్థాయి విజయాలు సాధించిన ఉదాహరణలుగా అధ్యయనం పేర్కొంది. తెలంగాణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్‌) ప్రధానంగా రుణాల పంపిణీకే పరిమితమవుతున్నాయి. 

భవిష్యత్‌లో వీటిని బహుళ సేవల కేంద్రాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అధ్యయనం సూచించింది. రైతులకు రుణాలతో పాటు విత్తనాలు, ఎరువులు, గిడ్డంగులు, ప్రాసెసింగ్‌ యూనిట్లు, మార్కెటింగ్, డిజిటల్‌ సేవలు, విలువ వృద్ధి కార్యక్రమాలు అందించే కేంద్రాలుగా పీఏసీఎస్‌లను తీర్చిదిద్దాలని పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటికే 311 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఎఫ్‌పీఓలుగా మార్చినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల వెల్లడించారు. రైతులకు విత్తనాల సరఫరా, నేల పరీక్షలు, మార్కెటింగ్, ప్రాసెసింగ్‌ వంటి సేవలను ఒకేచోట అందించే కేంద్రాలుగా పీఏసీఎస్‌లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ‘నాస్‌’అధ్యయనం కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించింది.

ముల్కనూరు మోడల్‌కు గుర్తింపు
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ముల్కనూరు సహకార సంఘం దేశంలోనే విజయవంతమైన సహకార నమూనాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. రైతులకు రుణాలు, ఎరువులు, మార్కెటింగ్, నిల్వ సదుపాయాలు ఒకే వేదికపై అందించడం ద్వారా సహకార వ్యవస్థ ఎలా విజయవంతమవుతుందో ఈ నమూనా చూపించిందని ‘నాస్‌’వర్క్‌షాప్‌లో నిపుణులు ప్రస్తావించారు.  

Advertisement
 
Advertisement
Advertisement