రాజకీయ'దుర్గం'! | Controversy over auction of Rayadurgam lands between Govt and SBI | Sakshi
Sakshi News home page

రాజకీయ'దుర్గం'!

Jun 21 2026 5:12 AM | Updated on Jun 21 2026 5:12 AM

Controversy over auction of Rayadurgam lands between Govt and SBI

ప్రభుత్వం, ఎస్‌బీఐ మధ్య చిచ్చురేపుతున్న రాయదుర్గం భూముల వేలం వివాదం

ఎస్‌బీఐ నేరుగా హైకోర్టును ఆశ్రయించడం వెనుక రాజకీయ కుట్ర ఉందనే భావనలో సర్కారు 

ఎస్‌బీఐ చైర్మన్‌పై ప్రధాని, ఆర్థిక మంత్రి, ఆర్‌బీఐ గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయం 

హెచ్‌సీయూ తరహాలోనే ఎస్‌బీఐని వాడుకున్నారనే భావనలో ప్రభుత్వం

డిపాజిట్ల ఉపసంహరణ ప్రారంభించిన సర్కారు.. రూ.25 కోట్లు ఉపసంహరించుకున్న టీజీఐఐసీ   

ఆ బ్యాంకుతో రాష్ట్ర ప్రభుత్వ శాఖలు జరిపే లావాదేవీల వివరాల సేకరణ 

ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి... రేపు కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: రాయదుర్గంలో భూముల వేలం వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మధ్య వివాదం అంశాన్ని ప్రభుత్వాన్ని రాజకీయంగా దెబ్బతీయడానికి ప్రత్యర్థి పార్టీలు వినియోగించుకుంటున్నాయన్న భావనలో ప్రభుత్వం ఉంది. ఎస్‌బీఐ చైర్మన్‌ శ్రీనివాసులు శెట్టిపై ప్రధానమంత్రి మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రాకు ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసే అవకాశం ఉంది. గతంలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ భూములను తాకట్టు పెట్టడాన్ని అడ్డుకున్న మాదిరిగానే రాయదుర్గంలోని భూముల బహిరంగ వేలాన్ని వివాదాస్పదం చేయడం వెనుక రాజకీయ కోణం ఉందని రాష్ట్ర ప్రభుత్వం బలంగా భావిస్తోంది.  

ఎస్‌బీఐతో కటీఫ్‌! 
2010లో భూ విక్రయంలో విధించిన నిబంధనలను పాటించకపోవడంతో భూ విక్రయాన్ని రద్దు చేస్తున్నట్లు ఎస్‌బీఐకి స్పష్టంచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఆ సేల్‌ డీడ్‌ను రద్దు చేస్తూ ఉత్తర్తులు జారీచేయకపోవడంతో ఎస్‌బీఐ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. ఆ భూ విక్రయాన్ని రద్దు చేయడంతోపాటు ఎస్‌బీఐకి ప్రత్యామ్నాయంగా నాలెడ్జి సిటీలో రూ.500 కోట్ల విలువైన రెండున్నర ఎకరాల భూమిని ప్రభుత్వం ఇవ్వడానికి ప్రతిపాదించినా సరే... ఎస్‌బీఐ ముందుకు రాకుండా వేలానికి ఒక రోజు ముందు అంటే మే 27న ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించింది. ఆ తిరస్కరణ లేఖ వేలం ముగిసిన మరుసటి రోజు టీజీఐఐసీకి అందినట్లు సమాచారం. వేలం నోటిఫికేషన్‌ జారీ చేసినప్పుడు కానీ, ప్రీబిడ్‌ సమావేశమప్పుడు గానీ స్పందించని ఎస్‌బీఐ ఆ మరుసటి రోజు హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం. 

ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతోనే కోర్టుకు వెళ్లిందన్న అభిప్రాయంతో సర్కారు ఉంది. దీని వెనుక రాజకీయ ప్రోద్బలం (కుట్ర) ఉందనే అనుమానాన్ని ప్రభుత్వ ముఖ్యులు వ్యక్తంచేస్తున్నారు. ఈనేపథ్యంలో ఎస్‌బీఐతో కఠినంగానే వ్యవహరించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఎస్‌బీఐతో ఉన్న లావాదేవీలను ఉపసంహరించుకునే అవకాశాలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో పరిశీలిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు ఎస్‌బీఐతో జరిపే ఆర్థిక లావాదేవీలు, డిపాజిట్ల వివరాల సేకరణలో ఆర్థిక శాఖ నిమగ్నమైంది. కనీసం రూ.5వేల కోట్లకు పైగా ప్రభుత్వ డిపాజిట్లు ఎస్‌బీఐలో ఉన్నట్లు ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా డిపాజిట్లను ఉపసహరించుకునే కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించగా, టీజీఐఐసీ దాదాపు 25 కోట్ల ఎఫ్‌డీలను ఉపసంహరించుకున్నట్లు సమాచారం.   

అప్పట్లోనే ఎకరా రూ. 25 కోట్లపైనే...  
రాయదుర్గం రెవెన్యూ పరిధిలో 2006–07 నాటికే ఎకరం భూమి మార్కెట్‌ ధర రూ.25 నుంచి రూ.30 కోట్ల వరకు ఉందని ప్రభుత్వం చెబుతోంది. 2010 నాటికి రాయదుర్గం పరిధిలో ఎకరం రూ.40 కోట్లు పలికింది. 2010లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సర్వే నం. 83/1లో 5 ఎకరాల భూమిని కార్యాలయ నిర్మాణం, ఇతర కార్యకలాపాల కోసం ఎస్‌బీహెచ్‌కు రూ.13.30 కోట్లకు కేటాయించింది. బహిరంగ మార్కెట్‌ ప్రకారం చూస్తే దీని విలువ రూ.200 కోట్లు. ఎస్‌బీహెచ్‌ నిర్మించే కార్యాలయాలు.. ఇతర వాణిజ్య కార్యకలాపాలతో ఆ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందని నాటి ప్రభుత్వం భావించింది. అయినా ఏడాది తరువాత కూడా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో 2012 సెపె్టంబర్‌లో ఎస్‌బీహెచ్‌కు ఏపీఐఐసీ షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. అయితే 2016 మార్చి 30న, జూన్‌ 27న మరింత సమయం కావాలంటూ ఎస్‌బీహెచ్‌ ప్రభుత్వాన్ని కోరుతూ లేఖలు రాసింది.   

రద్దు చేయాలంటూ టీఎస్‌ఐఐసీ లేఖ 
ఎస్‌బీహెచ్‌.. ఎస్‌బీఐలో విలీనమయ్యాక టీఎస్‌ఐఐసీ 2019 మే 27న ఆ భూ కేటాయింపును రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది. తమకు చివరి అవకాశం ఇవ్వాలంటూ ఎస్‌బీఐ 2020 జూలై 2న ప్రభుత్వానికి మరో లేఖ రాసింది. 15 రోజుల్లోగా ప్రాజెక్టుకు సంబంధించి కాలపరిమితి సమర్పించాలని ఎస్‌బీఐకి తుది షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుకు ఎస్‌బీఐ ఇచ్చిన సమాధానం 2020 సెప్టెంబర్‌ 1న ప్రభుత్వానికి అందింది. నిర్దిష్ట కాలపరిమితిలోగా నిర్దేశించిన ప్రయోజనానికి ఆ భూమిని వినియోగించుకోని పక్షంలో దానిని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.  

2021 జనవరిలో కేటాయింపు రద్దు 
ప్రభుత్వానికి ఉన్న అధికారం మేరకు 2021, జనవరి 22న ఎస్‌బీఐకి చేసిన భూ కేటాయింపును రద్దు చేసినట్లు అధికారవర్గాలు వివరించాయి. రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేఖ రాయడంతోపాటు ఎస్‌బీఐ జూన్‌1న హైకోర్టులో రిట్‌పిటిషన్‌ను దాఖలు చేసింది, రద్దు చేసిన భూమికి ప్రత్యామ్నాయంగా ఉస్మాన్‌నగర్, గండిపేటలో భూమి ఇవ్వాలని టీజీఐఐసీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈలోగా కాలపరిమితి పొడిగించే అంశాన్ని పునఃపరిశీలించాలని న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది. దీనికి ప్రత్యామ్నాయంగా కోర్టు కేసు ఉపసంహరించుకుని ఉస్మాన్‌నగర్‌లో భూకేటాయింపు కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఎస్‌బీఐకి సూచించింది. అయినా స్పందించకపోవడంతో 2024 ఆగస్టు 21న కేటాయింపుతోపాటు సేల్‌ డీడ్‌ రద్దు చేయాలని ప్రభుత్వానికి టీజీఐఐసీ లేఖ రాసింది. 

రద్దు పునరుద్దరణను తిరస్కరించామని, ప్రత్యామ్నాయ స్థలాల కోసం ముందుకు రావాలని 2024 ఆగస్టు 21న ఎస్‌బీఐని మరోసారి కోరింది. అప్పుడు కోర్టుకు వెళ్లగా.. 4 వారాల్లో ఎస్‌బీఐ ప్రతిపాదనను పరిశీలించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రతిపాదనలతో ముందుకు రావాలని 2026 మే 4న రావాలని టీజీఐఐసీ కోరింది. ఆ సమావేశంలో నాలెడ్జి సిటీలో 2.5 ఎకరాల భూమి ఇవ్వడానికి టీజీఐఐసీ ప్రతిపాదించింది. ప్రత్యామ్నాయ భూమి తీసుకోవడానికి ఎస్‌బీఐ సుముఖత వ్యక్తం చేసింది. దీనితో మే 6న వేలం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించి హెడ్‌ఆఫీసుతో మాట్లాడినట్లు ఎస్‌బీఐ అధికారులు తెలిపారు. మే 18న ప్రీబిడ్‌ సమావేశం నిర్వహించారు. ఆ మరుసటి రోజునే ఎస్‌బీఐ హౌస్‌ మోషన్‌ పిటీషన్‌ దాఖలు చేసింది. కానీ విచారణకు రాలేదు. మే 20న ఎస్‌బీఐ ప్రతిపాదనను ప్రభుత్వం మరోసారి తిరస్కరించింది.  

ఎస్‌బీఐ చైర్మన్‌ కారణం? 
మొదట్లో ఎస్‌బీఐ సుముఖత వ్యక్తం చేసి ఆ తరువాత ప్రభుత్వంపై బురద చల్లేవిధంగా కోర్టును ఆశ్రయించడంపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది., ఇందులో రాజకీయ హస్తం ఉందని భావిస్తోంది, తెలుగు వ్యక్తి ఎస్‌బీఐ చైర్మన్‌ శ్రీనివాసులు శెట్టి మహబూబ్‌నగర్‌ జిల్లా పెద్త పోతులపాడు గ్రామానికి చెందిన వ్యక్తి కావడంతో స్థానిక రాజకీయాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది, 16 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధి చేయని ఎస్‌బీఐ ఇప్పుడు అదే స్థలం కావాలంటూ కోరడం వెనుక రాజకీయాలే కారణమని భావిస్తోంది, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే 2.50 ఎకరాల్లో ఎస్‌బీఐ నిర్మాణాలు చేపట్టవచ్చని ఆ భూములు కేటాయించినా సకాలంలో పనులు చేపట్టకపోతే వాటిని కూడా రద్దు చేసే అధికారం ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement